కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యరీతిలో విజయం సాధించిన తరువాత ... ఆ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఇక ఈ ఏడాది ఆఖరులో జరగనున్న తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఆ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని... అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో పార్టీ కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి... ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ - సీడబ్ల్యూసీ సమావేశం జరిపేలా ఏర్పాట్లు చేస్తోంది. సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశం హైదరాబాద్లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించడంతో అధిష్ఠానం ఒప్పుకుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా 39 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అగ్రనేతల రాకతో తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో ఖచ్చితంగా నూతనోత్తేజం వస్తుందని అధిష్ఠానం విశ్వసిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశం చివరి రోజు అంటే సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో ఆ వేడుకల్లో సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం మోగించనుంది. మొత్తం వందమందికి పైగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, అక్టోబరు 2 నుంచి టీపీసీసీ బస్సు యాత్ర చేపట్టనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క, టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర కీలక నేతలంతా పాల్గొంటారని సమాచారం. కాగా... తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగే మరో మూడు రాష్ట్రాలు చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ బలంగా వుంది. చత్తీస్ గడ్, రాజస్ధాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఈ మూడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ విజయం సాధించి లోక్ సభ ఎన్నికలకు తాము సిద్ధమేనని ఘనంగా ప్రకటించాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బలంగా వున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇదిలావుండగా... లోక్ సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ... ఈ నెల 18 నుండి 22 వరకు అంటే ఐదురోజులు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన సీడబ్ల్యూసీ మీటింగ్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మీటింగ్ ను వాయిదా వేస్తారా లేక యధావిధిగా కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos