ఈసారి ఢిల్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఫిబ్రవరి 5న 70 స్థానాలకు పోటీ జరగనుండగా 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఆప్ బీజేపీల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. అయితే మధ్యలో కాంగ్రెస్ కూడా వచ్చి చేరింది. దీంతో కీలకమైన కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో త్రిముఖ పోరు సాగుతోంది. వరుసగా మూడు సార్లు ఆప్ కు అధికారం దక్కడంతో ఈ సారైనా బీజేపీకి అధికారం దక్కుతుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. తమకు అందని ద్రాక్షలా మారిన ఢిల్లీ పీఠాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీకి మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 2014 నుంచి ఆయన అనుసరిస్తున్న వ్యూహాలను డీకోడ్ చేయలేక బీజేపీ సంకట స్థితిని ఎదుర్కొంటోంది. ఇది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
మోదీ ప్రతిసారి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి పరాజయం తప్పడం లేదు. గత రెండుసార్లు బీజేపీ చాలా దారుణ పరాజయాలు ఎదుర్కొంది. ఇది మోదీ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. గతంలో పలుమార్లు ఓటమి అంచుల్లోకి వెళ్లి మరీ విజయం సాధించిన మోదీ.. విచిత్రంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తూనే ఉన్నారు. ‘కోడ్ కేజ్రీవాల్’ ఇప్పటికీ బీజేపీకి మిస్టరీగా మారింది. దీంతో కేజ్రీవాల్ వ్యూహాలను ఛేదించేందుకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మరింత దూకుడుగా ముందుకెళ్తూ బీజేపీని ఎక్కడికక్కడ ట్రాప్ చేస్తున్నారు. బీజేపీ అనూహ్యంగా అందులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీ ఓడిపోతే కనుక... అందుకు బీజేపీని తప్ప మరెవరినీ నిందించలేమని రాజకీయ నిపుణులు అంటున్నారు.
మరోవైపు.. ఆప్ ఢిల్లీలో నాన్ స్టాప్ గా అధికారంలో ఉంది. ఆ పార్టీ విషయంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కేజ్రీవాల్ క్రేజ్ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గిందనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి ఆప్ లో వర్గ పోరు అధికార పార్టీలో ఉండాల్సిన జాడ్యాలన్నీ కలగలిసి చీపురు పార్టీకి కొత్త భారాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. గతంలో దక్కిన 60కి పైగా సీట్లు ఈసారి దక్కకపోయినా సగానికి సగం అయినా ఆప్ కి వస్తాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
అదే జరిగితే ఢిల్లీలో మ్యాజిక్ ఫిగర్ అయిన 36 సీట్లు ఏ పార్టీకి దక్కే సూచనలు ఉండవని అంటున్నారు. అపుడు హంగ్ రావచ్చని చెబుతున్నారు. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. అయితే ఆప్ కి ఏ 30 దక్కి కాంగ్రెస్ కి ఆరేడు సీట్లు దక్కినా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ తాను బలపడి కొన్ని సీట్లు సాధిస్తే ఎన్నికల తరువాత అది ఆప్ కి సహాయంగా మారవచ్చు. అలా కాకుండా ఓట్లు చీలిస్తే మాత్రం బీజేపీకి ప్లస్ అవుతుంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos