లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతిపక్షాలను ఉద్దేశించి లోక్ సభలో అమిత్ షా ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వాళ్లు పదే పదే అంబేద్కర్ పేరును జపిస్తున్నారని, దీనికి బదులుగా ఏ దేవుడి పేరో తలచుకుంటే స్వర్గలోక ప్రాప్తయినా కలుగుతుందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్పై ముద్రవేసే ప్రయత్నం చేశారాయన.
ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై... దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ను వినిపించాయి. కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)తో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం నాడు ఉభయ సభలతో పాటు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కూడా ఈ ఆందోళనలు కొనసాగాయి.
లోక్సభ కార్యకలాపాలు ఆరంభం కావడానికి ముందు- పార్లమెంట్ ఆవరణకు ప్లకార్డులతో వచ్చారు ప్రతిపక్ష సభ్యులు. రాజ్యసభ, లోక్సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డింపుల్ యాదవ్.. ఇతర ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు. లోక్సభ ప్రారంభమైన తరువాత కూడా దీనికి బ్రేకులు పడలేదు. బయట ఎలాంటి సన్నివేశాలు కనిపించాయో.. లోపల కూడా అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలాపాలు ముందుకు సాగనివ్వలేదు. వారిని శాంతింపజేయడానికి స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోగా ... ప్రతిపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ, చప్పట్లు కొడుతూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ కనిపించారు. సభ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ... స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos