ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన దాడులు, వాటికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మంగళవారం రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ కు ఆందోళనకరమేనని ఆయన తేల్చేశారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ ఎదుర్కొన్న తరహాలో పశ్చిమాసియా సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిని పరిష్కరించేందుకు చర్చలు జరపాలని భారత్ సూచించిందన్నారు. మానవత్వంలో ఏ ప్రాణనష్టాన్ని సమర్థించలేమన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 3.75 లక్షల మందికి పైగా భారత్కు తిరిగి వచ్చారని గుర్తుచేశారు. ఒక్క ఇరాన్ నుంచే 1000 మంది తిరిగి వచ్చారని, వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులేనని అన్నారు. భారతీయుల భద్రతకు అన్ని దేశాలు హామీ ఇచ్చాయని, అయినప్పటికీ, కొందరు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. గత దశాబ్ద కాలంలో ఇలాంటి సంక్షోభాల కోసం భారతదేశం తన ముడి చమురు,పెట్రోల్ , డీజిల్ నిల్వలను విస్తరించుకుందని ప్రధాని మోదీ తెలిపారు. నిరంతరాయ సరఫరాను సులభతరం చేయడానికి భారత్ వద్ద పుష్కలమైన ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రధాని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నౌకలు హర్ముజ్ జలసంధి (strait of hormuz)లో చిక్కుకుపోయాయని, వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇది భారతదేశానికి కూడా ఒక ప్రధాన ఆందోళన అని మోదీ అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రాజ్యసభ నుంచి శాంతి సంప్రదింపుల కోసం ఒక ఐక్య స్వరం యావత్ ప్రపంచానికి వినిపించడం అవసరమని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, తాను పశ్చిమ ఆసియాలోని చాలా దేశాల అధినేతలతో రెండు విడతలుగా ఫోన్ సంభాషణలు జరిపినట్లు ప్రధాని మోదీ చెప్పారు. తాము అన్ని గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో కూడా టచ్లో ఉన్నామని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos