వన్ నేషన్, వన్ ఎలక్షన్ అని గట్టిగా పట్టుబట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ ముందుకు ఈ బిల్లును తీసుకురానుంది. వారం రోజుల నుంచి జమిలీ ఎన్నికలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇదిగో బిల్లు రెడీ అన్నారు. అంతలోనే లేదులేదు ఈసారికి లేనట్టే అంటూ మరికొన్ని లీకులు ఇచ్చారు. మొత్తానికి ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు.
ఈ నెల 20 వ తేదీ వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల లోపు జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదించుకొని జేపీసీకి పంపించాలని కేంద్రం భావిస్తోంది. . జమిలీ ఎన్నికలపై ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు, కొందరు రాజ్యాంగ నిపుణులు, ప్రజాస్వామిక వాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోవాలన్న యోచనలో అడుగులు వేసింది.
ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలంటే అందుకు వీలుగా రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ కు సవరణ చేయాల్సి ఉంది. లోక్ సభ, రాష్ట్రాల శాసన సభల గడువు కంటే ముందుగానే రద్దు చేసేందుకు పదవీ కాలపరిమితిలో మార్పులు చేయాల్సి ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చాలంటే అందుకు 327 ఆర్టికల్ సవరించాల్సి ఉంది. మన దేశంలోని మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్ము కాశ్మీర్ కు శాసన సభలు ఉన్నాయి. ఇందు కోసం ప్రత్యేక చట్ట సవరణ అవసరం. దీని కోసం మరో బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ఈ బిల్లుకు ఇంకా క్యాబినెట్ ఆమోద ముద్ర పడలేదు. కేవలం పార్లమెంట్, రాష్ట్రాల శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు జరిపే బిల్లును మాత్రమే క్యాబినెట్ ఆమోదించింది.
రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడింట రెండు వంతుల మెజార్టీ అంటే 361 మంది సభ్యుల మద్ధతు ఈ బిల్లుకు అవసరం. కానీ ఎన్డీఏ బలం 293 మాత్రమే. రాజ్య సభలో అధికార పార్టీకి 122 మంది సభ్యులు ఉన్నారు. 243 సభ్యులున్న రాజ్య సభలో మూడింట రెండు వంతుల మెజార్టీ అంటే 162 మంది మద్ధతు అవసరం. ఈక్వేషన్స్ ఇలా ఉంటే ఇప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్న ఎన్డీఏ మిగతా పార్టీలను ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తిగా మారింది. దీనిపై ఏం జరుగుతుందో మరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos