లోక్ సభ, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లులను నిన్న మంగళవారం లోక్సభలో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత ఈ బిల్లుల విస్తృత పరిశీలన కోసం ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ - జేపీసీకి పంపుతూ లోక్సభ నిర్ణయించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది విస్తృత చర్చ కోసం రూపొందించిన ఒక ప్రత్యేక సమితి. అయితే, జేపీసీని ఎలా ఏర్పాటు చేస్తారు... ఈ కమిటీ ఏం చేస్తుందనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
పార్లమెంట్లో ఉన్న ఎంపీల సంఖ్య ఆధారంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ్యులను కమిటీలోకి తీసుకుంటారు. రాజ్యసభ సభ్యులు కూడా కమిటీలో ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను కలిగివున్న పార్టీకి కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తారు. ప్రస్తుతం ఆ అవకాశం బీజేపీకి దక్కనుంది. అంతేకాదు, కమిటీలో ఎక్కువ మంది సభ్యులకు కూడా ఆ పార్టీకి చెందిన వారే ఉండనున్నారని తెలుస్తోంది.
జేపీసీలో గరిష్ఠంగా 31 మంది సభ్యులు ఉండవచ్చు. ఈ కమిటీ కాల వ్యవధి 90 రోజులుగా ఉంటుంది. అవసరమైతే ఆ తర్వాత గడువును పొడిగించే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిపోనున్న క్రమంలో ఈ లోగా కమిటీని ఏర్పాటు చేయకపోతే బిల్లు మురిగిపోతుంది. అలా జరిగితే తదుపరి పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లుని తిరిగి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందువల్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరో 48 గంటల్లోనే జేపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా విపక్షాలు జమిలి ఎన్నికలను స్వేచ్ఛాయుతమైన ఎన్నికల సూత్రాలకు వ్యతిరేకంగా భావిస్తున్నాయి. ఒకే సమయానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రాంతీయ పార్టీల స్వతంత్రతకు భంగం కలుగుతుందని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇదిలా ఉండగా కమిటీలో సభ్యులుగా ఉండని ఎంపీలు, మాజీ జడ్జిలు, లాయర్లు వంటి ఇతర న్యాయ, రాజ్యాంగ నిపుణులతో పాటు సంబంధిత భాగస్వాములతో జేపీసీ సభ్యులు ‘విస్తృత సంప్రదింపులు’ జరుపుతారు. బిల్లు చట్టంగా మారితే ... ఎలక్షన్ కమిషన్ మాజీ సభ్యులను కూడా సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకోవడమే కాకుండా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను కూడా సంప్రదిస్తారని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణ జనాల అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత ... ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి క్లాజులవారీగా లోక్సభకు నివేదికను సమర్పించనుంది. ఆ తర్వాత ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలు చట్టంగా మారితే, భారత రాజకీయాల్లో ఎంతో పెద్ద పరిణామం జరుగుతుందని, దీనివల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను మార్చుకోవడం ఖాయమని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos