ఒకే దేశం, ఒకే ఎన్నికపై నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో ప్రియాంక గాంధీకి చోటు దక్కినట్లు సంబంధిత వర్గాలు బుధవారం ప్రకటించాయి. ప్రియాంక గాంధీతో పాటు సీనియర్ నేతలు మనీష్ తివారి, రణదీప్ సుర్జేవాలా, జార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ సుఖ్దేవ్ భగత్లతో పాటు నాలుగో సభ్యురాలిగా ప్రియాంక గాంధీ పేర్లను ప్రతిపాదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. తృణమూల్ కాంగ్రెస్ కూడా పలువురి పేర్లు ప్రతిపాదించింది. టీఎంసీ నుండి సాకేత్ గోఖలే, కల్యాణ్ బెనర్జీలు ఉన్నారు. బీజేపీ నుంచి ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, నిశికాంత్ దుబే పేర్లును ప్యానెల్ సభ్యులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బిల్లుపై అధ్యయనం చేయడానికి కమిటీలో 31మంది ఎంపీలు ఉంటారని, అందులో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10మంది ఉండనున్నట్లు సమాచారం. విపక్షాల తీవ్ర వ్యతిరేకత మధ్య లోక్సభ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రెండు బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాటిని జేపీసీకి పంపాలంటే ముందు లోక్సభ తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జేపీసీని స్పీకర్ ఏర్పాటు చేస్తారు.
కాగా ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని వయనాడ్ ఎంపి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మీడియాతో అన్నారు. ఇది మన దేశ సమాఖ్య వాదానికి విరుద్ధమని, ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేదా పార్లమెంటుకు లోబడి ఉండవని టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ బిల్లులు రాష్ట్రాల అసెంబ్లీల స్వయంప్రతిపత్తిని తొలగిస్తాయని మండిపడ్డారు. ఇది ఎన్నికల సంస్కరణ కాదని, ఓ జెంటిల్మెన్ కలను, కోరికను నెరవేర్చడమేనని పరోక్షంగా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు.
కాగా ఈ బిల్లుపై సభలో నిన్న మంగళవారం ఎన్డీఏ మిత్ర పక్షాలు పూర్తి మద్దతును ప్రకటించాయి. కానీ కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos