తమిళ సినీ హీరో... టీవీకే అధ్యక్షుడు విజయ్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన విజయ్ ను వెంటాడుతోంది. తొక్కిసలాట తరువాత ఆసక్తికర అంశాలు తెర మీదకు వచ్చాయి. ఇక.. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ సీబీఐ ఈ కేసు లో అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు విజయ్ కోసం బీజేపీ.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న వేళ.. సీబీఐ తాజా నిర్ణయం కీలక మలుపుగా మారుతోంది.
కరూర్ తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు టీవీకే పార్టీ నేతలను విచారణ చేసింది. తాజాగా టీవీకే చీఫ్ విజయ్ కు నోటీసులు జారీ చేస్తూ ఈ కేసులో విచారణ కు ఈ నెల 12న హాజరు కావాలని నిర్దేశించింది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే చీఫ్ నటుడు విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 41 మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ విషాదంపై న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జస్టిస్ కె.మహేశ్వరి, జస్టిస్ ఎన్.వి అంజారియాలకు స్థానం దక్కింది. కాగా, ఇప్పుడు విజయ్ కు సీబీఐ నోటీసు జారీ చేయటం.. ఢిల్లీలో విచారణ చేయనుండటం కీలకంగా మారుతోంది.
ఈ ఘటన తరువాత విజయ్ బాధితులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఆర్దిక సాయం చేసారు. తమిళనాడు ప్రభుత్వం సైతం పరిహారం ప్రకటించింది. కాగా, తొలుత ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధురై బెంచ్ విచారణ జరిపింది. ఇక.. కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. టీవీకే పార్టీకి చెందిన పలువురు నేతలను ఇప్పటికే విచారణ చేసింది. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల వేడి క్రమేణా పెరుగుతోంది. తాజాగా అమిత్ షా పర్యటన సమయంలో విజయ్ పైన చర్చ జరిగినట్లు బీజేపీ నేతల సమాచారం. అటు కాంగ్రెస్ సైతం విజయ్ తో మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో సీబీఐ నోటీసులు జారీ చేయటంతో.. విజయ్ తదుపరి నిర్ణయాలు.. రాజకీయ కార్యాచరణ పైన ఆసక్తి నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos