తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం యువతే నిర్ణయించనుంది. ఎందుకంటే ఓటర్లలో సగానికి పైగా వీరే ఉన్నారు. ఇటీవలే ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. మొత్తం 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా... అందులో 18 నుంచి 39 సంవత్సరాల లోపు వయసు గలవారు 1.60 కోట్ల మంది ఉండటం విశేషం. 18 నుంచి 19 ఏళ్ల వయసున్న తొలి ఓటర్లు 2014తో పోలిస్తే స్వల్పంగా తగ్గారు. 30 నుంచి 39 ఏళ్ల వయసున్న వారు అత్యధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య 91 లక్షలకు పైమాటే. 80 ఏళ్లు పైబడిన వారు 2018 ఎన్నికల నాటి గణాంకాలతో పోలిస్తే లక్షన్నర మంది పెరిగారు. ఇక శతాధికులు 7689 మంది ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే వీరి సంఖ్య రెట్టింపైనట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక రాజకీయ పార్టీల నేతల విషయానికొస్తే... బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి... ఎక్కువమంది యువతకు టికెట్లు ఇచ్చి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ గా నిలిచారు. పాలనలో.. రాజకీయాల్లో యువరక్తం రావాలని కేసీఆర్ పలు సందర్భాల్లో చెబుతుంటారు. అదేవిధంగా ఆయన అధికశాతం యువతకు, మధ్యవయస్కులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారు. కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లోనే కాకుండా ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కొత్తవారికి అవకాశం కల్పించింది. 2018 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ యువ రక్తానికి ఆ పార్టీ అవకాశాలిచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కురువృద్ధుడు జనారెడ్డిపై నోముల భగత్ అనే యువకుడిని బరిలో నిలిపి అతిసునాయాసంగా విజయం సాధించింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వివేక్పై బాల్క సుమన్ను నిలిపి జయకేతనం ఎగురవేసింది. తుంగతుర్తిలో గాదరి కిశోర్ లాంటి ఎంతోమంది యువకులకు బీఆర్ఎస్ పార్టీ చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కల్పించింది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్లో బరిలో పోటీ చేస్తున్న 119 మంది అభ్యర్థుల్లో ఎక్కువ మంది యువత లేదా మధ్యవయస్కులు ఉండటం గమనార్శం. ఇందులో ములుగులో బడే నాగజ్యోతి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, కోరుట్ల నుంచి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఖానాపూర్ నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్, కార్వాన్ నుంచి ఐ కృష్ణయ్య, మలక్పేట నుంచి తీగల అజిత్రెడ్డి వంటి ఏడుగురు కొత్తవారికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. బీఆర్ఎస్తోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేటీఆర్, హరీశ్రావు, దాస్యం వినయభాస్కర్, బాల్క సుమన్, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, గాదరి కిశోర్, నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి.. ఇలా ఎంతోమంది యువకులను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో భవిష్యత్తు తరానికి యువ నాయకత్వాన్ని అందించే పనిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాజకీయాల్లో 18 నుంచి 50 లేదా 55 సంవత్సరాల వారిని యువ నాయకులుగా చెప్పుకొనే సంప్రదాయం ఉన్నది. ఈ లెక్కప్రకారం చూస్తే... బీఆర్ఎస్ లో ఈ సారి సగానికి పైగా యువ, మధ్యవయస్కులే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos