జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అట్టుడుకుతోంది. రెండు నెలలుగా హింస చల్లారడం లేదు. అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్ పర్యటనకు గాను... రాహుల్ గాంధీ ఇంఫాల్లో దిగి హింసకు కేంద్రంగా ఉన్న చురాచాంద్పూర్ వైపు వెళుతుండగా... బిష్ణుపూర్ వద్ద పోలీసులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీంతో ఆయన కాన్వాయ్ ఇంఫాల్కు వెనుదిరిగింది. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్లో పర్యటనకు వెళ్లి... తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్న బాధితులను కలిసి పరామర్శించారు. బాధితులకు ఆత్మీయ స్పర్శ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టారు. మణిపూర్ లో మే 3వ తేదీ నుంచి మైటీ, కుకీ తెగల మధ్య హింస జరుగుతుండటం.. ఈ అల్లర్లలో ఇప్పటివరకు దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మైటీలకు గిరిజన హోదా కల్పించాలనే హైకోర్టు సిఫారసులు ఇందుకు కారణంగా మారాయి. మైటీ వర్గానికి చెందిన సీఎం బీరెన్ సింగ్ కూడా కుకీలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
ఇదిలావుండగా... రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సీఎం .... గవర్నర్ అనసూయ యూకీ అపాయింట్మెంట్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. గవర్నర్ యూకీని కలిసి రాజీనామా పత్రాలను సీఎం అందిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో పెచ్చరిల్లిన హింసను నియంత్రించడంలో సీఎం బీరేన్ సింగ్ విఫలమయ్యారనే ప్రధాన కారణంతోనే ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి గురువారం ఆయనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, రాజీనామా పత్రాలు అందించాలని లేదంటే.. కేంద్రమే రాష్ట్ర పాలనను అదుపులోకి తీసుకుంటుందనే ఆప్షన్ను ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సీఎం బీరేన్ సింగ్ రాజీనామా విషయం ఇంతవరకు ఎవ్వరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. మణిపూర్ లో మున్ముందు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos