బీఆర్ఎస్ మాజీ నేత మైనంపల్లి హన్మంతరావు ఈ నెల 27న కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్దమైంది. ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కుమారుడు రోహిత్తోపాటు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మైనంపల్లికి మల్కాజిగిరి, ఆయన కుమారుడికి మెదక్ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లగా తెలుస్తోంది. దీంతో ఆయన ఈ నెల 27వ తేదీన పార్టీలో చేరనున్నారు.
మైనంపల్లితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. సర్వే రిపోర్ట్ ఆధారంగా మైనంపల్లికి , ఆయన కుమారుడికి మల్కాజిగిరి, మెదక్ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారని ఆయన చెబుతున్నారు. మైనంపల్లిని పార్టీలోకి ఆహ్వానించేందుకు సోమవారం కాంగ్రెస్ నేతలు ఆయన నివాసానికి క్యూ కట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, దామోదర రాజనరసింహ తదితరులు దూలపల్లిలోని మైనంపల్లి ఇంటికి చేరుకుని ఆహ్వానించారు. కాగా ... తాను మల్కాజిగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే మైనంపల్లి స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి తాను పోటీ చేస్తానని ప్రచారం జరుగుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని ... మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి మాత్రమే పోటీ చేయబోతున్నట్లు మైనంపల్లి స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తలే ముఖ్యమని అన్నారు. అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని చెప్పారు. అంతకుముందు దామోరద రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మైనంపల్లితో తమకు రాజకీయాలకు అతీతంగా సంబంధాలున్నాయని తెలిపారు. ఆయన 27న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీల సమక్షంలో పార్టీలో చేరతారని చెప్పడంతో మైనంపల్లి ఏ పార్టీలో చేరతారన్న ఉత్కంఠకు నేటితో తెరపడినట్లయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos