తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... అన్ని పార్టీల్లోనూ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్లోకి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు పెరిగిపోయాయి. అయితే శుక్రవారం ... బీజేపీకి చెందిన భార్యాభర్తలైన ఇద్దరు నేతలు బీఆర్ఎస్లో చేరగా... అదే సమయంలో బీఆర్ఎస్ కు చెందిన ఒక ప్రముఖ నాయకుడు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయ్యారు. బీజేపీ గద్వాల్ జిల్లా ఇన్ చార్జ్గా ఉన్న వెంకటరెడ్డి .. బాగ్ అంబర్పేట్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న ఆయన సతీమణి పద్మా వెంకట రెడ్డి గులాబీ గూటికి చేరారు. వారు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ ఇస్తూ... ఆ పార్టీ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ కారణం వెనుక కొంత నేపథ్యం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మైనంపల్లి తనతో పాటు తన కుమారుడు రోహిత్కు మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్లు ఆశించారు. అయితే సీఎం కేసీఆర్ కొంతకాలం కిందట ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల జాబితాలో మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు టికెట్ కేటాయించగా.. రోహిత్కు మాత్రం నిరాకరించారు. ఈ పరిణామాలతో మైనంపల్లి హనుమంతరావు రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి పార్టీలో కోల్డ్ వార్ జరుగుతుండటంతో హనుమంతరావు కొన్నాళ్లుగా పార్టీ అధినాయకత్వంతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ క్రమంలో... శుక్రవారం ఆయన సడన్ గా పార్టీకి రాజీనామా చేశారు. మల్కాజిగిరి ప్రజలు, కార్యకర్తలు, తెలంగాణ నలుమూలలా ఉన్న తన శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరేది వీలైనంత త్వరలో తెలియజేస్తానని... మల్కాజిగిరి ప్రజలకు, రాష్ట్రంలోని తన శ్రేయోభిలాషులకు కడవరకు అండగా నిలుస్తానని వివరించారు. ప్రజల కోరిక మేరకే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, దేనికీ భయపడేది లేదని ... తనకు పార్టీ కన్నా.. తన కుమారుడి భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. తాను కేసీఆర్, కేటీఆర్.. చివరికి ఆ దేవుడ్ని కూడా లెక్క చేయనంటూ మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ ఆడియో కూడా బయటికి వచ్చింది. అయినా... బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ఆయన్ను రెబల్ కింద పరిగణించింది. ఈ క్రమంలో ఆయన రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏ పార్టీ వైపు అడుగులేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మైనంపల్లి 1998లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos