ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా... పాలమూరులో నరేంద్ర మోడీ పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ హామీలు ప్రకంటించడంతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మోడీ నిజామాబాద్ పర్యటనను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని... సభకు రైతులను, మహిళలను భారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో రైతులు కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని మోడీకి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో బదులివ్వడం గమనార్హం. తమకు రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు. కాగా.. నిజామాబాద్ పర్యటనలో రూ. 8,021కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని ప్రజలకు అంకితం చేస్తారు. రామగుండంలో నిర్మించిన 800 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. రూ.1360 కోట్లతో 496 బస్తీ దవాఖానాలకు 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్లను మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. అదేవిధంగా... రూ. 1200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్ - సిద్దిపేట మధ్య నిర్మించిన రైలుమార్గాన్ని కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. రూ. 305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్ను ప్రజలకు అంకితం చేస్తారు. సిద్దిపేట- సికింద్రాబాద్ మార్గంలో తొలి రైలు సర్వీసును వర్చువల్గా ప్రారంభిస్తారు. ప్రధాని మధ్యాహ్నం బీదర్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్కు చేరుకుని... అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తరువాత బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి బయలుదేరి బీదర్ ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. కాగా... అక్టోబర్ మొదటివారంలోనే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నారని సమాచారం. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నందున... బీజేపీ జాతీయ నేతల పర్యటనలు పెరిగిపోతుండటంతో రాష్ట్రాస్థాయి నేతల్లో హడావుడి కనిపిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos