తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 115 స్థానాలకు ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించి సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఐదుస్థానాలను పెండింగ్ లో ఉంచగా… ఆయా స్థానాల విషయంలోనూ కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కీలకమైన నర్సాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా…. సునీతా లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రెండు రోజుల క్రితం నర్సాపూర్ బీఆర్ఎస్ నాయకుడు మదన్ రెడ్డి వర్గం … మంత్రి హరీశ్ రావును కలవగా…. టికెట్ అంశంపై మంత్రి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. సునీతా లక్ష్మా రెడ్డితో కలిసి పనిచేసుకోవాలని చెప్పేసరికి... మదన్ రెడ్డి వర్గ నాయకులు విస్తుపోయారని సమాచారం. ఆ తర్వాత, మదన్ రెడ్డి అనుచరులు కొంతమంది నర్సాపూర్ పట్టణంలో ఒక సెల్ టవర్ ఎక్కి… మదన్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తేనే దిగుతామని బెట్టు చేశారు. పోలీసులు చెప్పినా వినకపోవడంతో… స్వయంగా మదన్ రెడ్డి అక్కడికి చేరుకుని వాళ్ళతో మాట్లాడి కిందికి దిగాలని అడిగారు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన మదన్ రెడ్డి అభ్యర్ధనను తప్పకుండ పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందని ఆయన అనుచరులు భావించారు. కానీ పార్టీ వారి అభిష్టానికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుందని వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అయితే మదన్ రెడ్డి అనుచరులు ... సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల్లో పనిచేయరనే వాదన వినిపిస్తోంది. తాజా పరిణామాలను అంచనా వేసుకుంటున్న మదన్ రెడ్డి అనుచరులు... ఇక టికెట్ పై ఆశలు వదులుకున్నట్లే నని తెలుస్తోంది. వాస్తవానికి నియోజకవర్గంలో మదన్ రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి మొదటినుండి ఉప్పు నిప్పుగానే ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మదన్ రెడ్డి… అంతకుముందు వరుసగా మూడుసార్లు 1999, 2004, 2009 కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి ని ఓడించారు. అంతకుముందు సునీతా లక్ష్మా రెడ్డి చేతిలో మదన్ రెడ్డి కూడా ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత… సునీతా లక్ష్మా రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. మరోవైపు ఈసారి తనకే ఎమ్మెల్యే సీటు ఇస్తామని చెప్పారని… ముఖ్యమంత్రి తప్పకుండా మాట నిలబెట్టుకుంటారని సునీత లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ అంశం ఉత్కంఠగానే మారింది. ఇరు వర్గాలు టికెట్ పై ధీమాగా ఉన్న నేపథ్యంలో…. అధినాయకత్వం చేసే తుది ప్రకటనలో ఎవరి పేరు ఉంటుందనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos