వార్షిక బడ్జెట్ 2025-26ను మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. మోదీ 3.O సర్కార్.. పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. రికార్డు స్థాయిలో వరుసగా 8వ సారి కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్.. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే సూక్తితో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తామని, తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో పేదరికాన్ని పూర్తిగా రూపమాపడమే లక్ష్యంగా 2025-26 వార్షిక బడ్జెట్ను రూపొందించినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్ధికవృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆమె అన్నారు. పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక ప్రకటించారు. దేశంలో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎంపికచేసిన వంద జిల్లాల్లో ప్రధాన మంత్రి ధాన్యయోజన పథకాన్ని ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్టు ఆర్దిక మంత్రి తెలిపారు. ధాన్యం ఉత్పత్తి తక్కువగా ఉన్న, వ్యవసాయం లాభసాటిగా లేని వంద జిల్లాల్లో రాష్ట్రాల భాగస్వామ్యంతో 1.7 కోట్ల మంది రైతుల జీవితాలను మార్చడం కోసం ఈ పథకాన్ని చేపట్టనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అందజేసే రుణాల పరిమితిని కూడా పెంపునకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఈ రుణాలను రూ. 3 లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. స్టార్టప్లను మరింత ప్రోత్సహించేందుకు వాటికోసం బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఫండ్ ఆఫ్ ఫండ్ కింద ఎక్కువ మంది పనిచేసే కార్మికులున్న ఎంఎష్ఎంఈలకు ప్రాధాన్యత ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కేన్సర్ సెంటర్లను ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఇవి నెలకొల్పుతామని, ఈ వార్షిక సంవత్సరంలో 200 ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు. గిగ్ వర్కర్లను ఈ-శ్రామ్ పోర్టర్లో రిజిస్టర్ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కోటి మంది గిగ్ వర్కర్లకు హెల్త్ కేర్ సపోర్ట్ అందిస్తామన్నారు.
దేశంలోని ఐదు చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ప్రపంచస్థాయి నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. పోషణ 2.0లో భాగంగా అంగన్వాడీల్లో అధునాాతన సౌకర్యాలు కల్పించి.. మరింత నాణ్యమైన ఆహారం చిన్నారులు, బాలింతలకు అందజేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్కు రూ.25 వేల కోట్లు కేటాయించినట్టు ఆర్ధిక మంత్రి తెలిపారు
అదేవిధంగా బడ్జెట్ లో బిహార్పై వరాల జల్లు కురిపించారు. మఖానా బోర్డుతో పాటు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మాణానికి నిధులు కేటాయించింది. పట్నా విమానాశ్రయాన్ని మరింత విస్తరించనున్నట్టు తెలిపింది. మిథిలాంచల్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. అదేవిధంగా అసోంలో భారీ యూరియా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయగా.. 12.7 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.
దేశంలో మెడికల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని, ఇందుకోసం బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి వివరించారు. దేశంలో టాప్ 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా హోటల్స్, డెస్టినేషన్స్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెడికల్ టూరిజంను ప్రైవేట్ సెక్టార్కు విస్తరిస్తామని తెలిపారు.
కాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాట విషయమై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నిరసగా పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో ఆరంభంలో సభలో కాస్త గందరగోళం తలెత్తింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos