బీహార్ రాజధాని పాట్నాలో ఈ నెల 23వ తేదీన జరగనున్న ప్రతిపక్షాల కీలక భేటీలో పాల్గొనేందుకు 15 పార్టీల అధినేతలు సిద్ధమవుతున్నారు. పార్టీల నుండి ప్రతినిధులను పంపటం కాకుండా డైరెక్టుగా తామే పాల్గొనబోతున్నట్లు పార్టీల అధినేతలు బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు స్పష్టంగా చెప్పారు. ప్రతినిధులను కాకుండా స్వయంగా అధినేతలే హాజరుకావాలన్నది నితీష్ పెట్టిన నిబంధన. తాజా సమాచారం ప్రకారం 15 పార్టీల అధినేతలు అంటే మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు నితీష్ తో మాట్లాడి చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పాట్నా ప్రతిపక్షాల సమావేశం మొదటి ప్రయత్నం అవుతుంది. ఇక్కడ మంచి వాతావరణంలో చర్చలు జరిగితే ... భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిగేందుకు నాంది అవుతుంది. అలాగే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మొదటి అడుగు పడటమే కీలకమని అందరికీ తెలిసిందే. మొదటి అడుగు గనుక సరిగ్గా పడితే తర్వాత అడుగులు దానంతట అవే పడతాయి. ఇపుడు నితీష్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇందులో భాగమే. ప్రతిపక్షాల ఐక్యత అన్నది రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనే బయటపడుతుంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు తప్ప ఇతర పార్టీలకు చెప్పుకోదగ్గ బలం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతుగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాటం చేస్తే ఫలితం ఎలాగుంటుందో ఆ రాష్ట్రాల ఎన్నికల్లో తేలిపోతుంది.
అందుకనే 23 మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. 23న జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ గత ఏడాది కాలంగా.. బీజేపీ వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమిస్తానని ప్రకటనలు చేశారు. కేంద్ర విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో విపక్షనేతలతో సమావేశమై చర్చలు జరిపారు. కాంగ్రెస్ మినహా వివిధ విపక్షాల నాయకుల వద్దకు కేసీఆర్ స్వయంగా వెళ్లి మంతనాలు జరిపారు.
గత ఏడాది ఆగస్టు 31న పాట్నాలో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్లతో సమావేశమై ‘‘బీజేపీ-ముక్త్ భారత్’’కు కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో తృతీయ కూటమి ఏర్పాటు చేసి తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే స్వారత్రిక ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా భరిస్తానని కేసీఆర్ చెప్పినట్టుగా ప్రచారం సాగింది. అలాంటి కేసీఆర్.. ఈ నెల 23న పాట్నాలో జరగనున్న విపక్షాల కీలక సమావేశానికి ఎందుకు దూరంగా ఉంటున్నారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసు నుంచి తన కుమార్తెను కాపాడుకోవడానికి... కొందరు బీజేపీ పెద్దలతో కేసీఆర్ అంతర్గత మంతనాలు జరిపారని.. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా కేసీఆర్ తన ప్రసంగాలలో బీజేపీపై విమర్శలను తగ్గించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలాగే బీజేపీ ముక్త్ భారత్ అని పిలునిచ్చిన కేసీఆర్.. బీజేపీ వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీష్ కుమార్ ప్రయత్నాలకు చేయూతనివ్వలేదు. ఈ క్రమంలోనే విపక్షాలు కూడా కేసీఆర్ వ్యవహార శైలిని నమ్మడం లేదని.. అందువల్లనే విపక్షాల భేటీకి ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేసీఆర్ను విపక్షాల సమావేశానికి ఆహ్వానించలేదని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్వయంగా వెల్లడించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి, ఏపీ సీఎం వైఎస్ జగన్, శిరోమణి అకాలీదళ్ కు చెందిన సుఖ్బీర్ సింగ్ బాదల్, జేడీఎస్ కు చెందిన హెచ్డీ కుమారస్వామి లకు విపక్షాల సమావేశానికి ఆహ్వానాలు లేవు.
ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ, ఉద్దవ్ శివసేన, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. తదితర పార్టీలు హాజరుకానున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ని పార్టీలు ఏకతాటిపైకి రావడం కూడా ఇదే తొలిసారి కావచ్చు. అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్తో చాలా సఖ్యతగా మెలిగిన పలువురు విపక్ష నేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకావడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడేందుకు విపక్షాలు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయోమరి చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos