దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ పార్టీని గద్దె దించాలని ... కనీసం ఆ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకుండా చేయాలని ప్రతిపక్షాల లక్ష్యం. అలా దెబ్బ కొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి. కానీ ఇక్కడ అది సాధ్యమయ్యేలా లేదు. ప్రతిపక్షాలన్నీ ఆయా రాష్ట్రాల్లో తామే బలంగా ఉండాలని కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ కి చోటివ్వడానికి ఇష్టపడటం లేదు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్ లో కాంగ్రెస్ పోటీ చేయకుండా ... రాజస్థాన్ లో ఆప్ పోటీ చేయకుండా ఒప్పందం కుదుర్చుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఒక ప్రతిపాదన చేశారు. మరోవైపు యూపీలో కాంగ్రెస్ అడుగుపెట్టకపోతే ఆ పార్టీకి కేంద్రంలో మద్దతిచ్చే అంశాన్ని పరిశీలిస్తామంటున్నారు సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. కాంగ్రెస్ కి మద్దతిస్తాం కానీ... పశ్చిమబెంగాల్ లో మాదే రాజ్యమంటున్నారు మమతా బెనర్జీ.
ఒకరకంగా ఈ కుమ్ములాటే బీజేపీకి మానసిక స్థైర్యాన్నిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే అంతిమంగా తాము బలపడాలని భావిస్తోంది కమలదళం. అసలు... కేంద్రంలోని బీజేపీని దెబ్బకొట్టడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండటంతోపాటు ఒక ప్రధాన పార్టీ ... వాటికి అనుసంధానంగా ఉండాలి. ఆ బాధ్యత తాను తీసుకుంటానంటోంది కాంగ్రెస్. అయితే... ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ, టీఎంసీ వంటి పార్టీలు కాంగ్రెస్ కి పెత్తనం ఇవ్వడానికి ఇష్టపడటం లేదు.
ఎన్సీపీ, డీఎంకే వంటి పార్టీలు కూడా కాంగ్రెస్ బలపడాలనుకుంటున్నాయి కానీ, తమకంటే బలంగా మారడం మాత్రం వారికి ఇష్టం లేదు. కానీ ఈ పార్టీలన్నీ విడివిడిగా పోరాటాలకు సిద్ధమయితే లాభం లేదు. ఇగోలు పక్కనపెట్టి కలసి పోరాడితేనే బీజేపీకి గుణపాఠం చెప్పగలరు. కానీ ప్రతిపక్షాలు.. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ పార్టీలు కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ఇష్టపడటం లేదు. బీజేపీని మట్టికరిపించడానికి సై అంటున్నారు కానీ, తమ పుట్టలో కాంగ్రెస్ వేలు పెట్టకూడదనేది వారి కండీషన్. అలాంటి కండీషన్లకు కాంగ్రెస్ ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సహిత ప్రతిపక్షాల ఐక్యత ఎలా సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos