ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో కొత్త రైల్వే సేవలకు ఈరోజు పచ్చజెండా ఊపారు. తిరువనంతపురం నుంచి మూడు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఒక ప్యాసింజర్ రైలును ఆయన ప్రారంభించారు. దేశంలో రైల్వే కనెక్టివిటీని ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. కొత్తగా ప్రారంభించిన వాటిలో తిరువనంతపురం - చర్లపల్లి, నాగర్కోయిల్ - మంగళూరు, తిరువనంతపురం - తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వీటితో పాటు త్రిస్సూర్ - గురువాయూర్ మధ్య కొత్త ప్యాసింజర్ రైలును కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఈ రైళ్లు తమ గమ్యస్థానాలకు బయలుదేరాయి. ఈ నాలుగు సర్వీసులను దక్షిణ రైల్వే నిర్వహించనుంది. తిరువనంతపురం - చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణిస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే, తిరువనంతపురం - తాంబరం రైలు తమిళనాడులోని పారిశ్రామిక, విద్యా కేంద్రాలకు అనుసంధానంగా ఉంటుంది.
అమృత్ భారత్ రైళ్లను సామాన్యులకు తక్కువ ధరలో మెరుగైన సౌకర్యాలు అందించేలా రూపొందించారు. ఇవి నాన్-ఏసీ రైళ్లు అయినప్పటికీ, వీటిలో ప్రయాణికుల భద్రత కోసం ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు ఫోన్ చార్జర్ సాకెట్, బాటిల్ హోల్డర్ వంటి వసతులు కల్పించారు. కోచ్లు విశాలంగా, సౌకర్యవంతంగా ఉన్నాయని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. సంప్రదాయ రైళ్లకు, ప్రీమియం రైళ్లకు మధ్య అంతరాన్ని తగ్గించి, తక్కువ ఛార్జీలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ రైళ్ల లక్ష్యమని రైల్వే అధికారులు తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos