దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని, త్రివిధ దళాలు చక్రవ్యూహాలు పన్ని శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పారు. మన మహిళల సిందూరం చెరిపేసిన వాళ్లను మట్టిలో కలిపేశామని, పహల్గాం ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టామని ప్రధాని వివరించారు.
మన సాయుధ దళాలు పాక్ను మోకాళ్ల మీద నిలబెట్టాయని, భారత్లో రక్తపుటేర్లు పారించినవాళ్లను ముక్కలు ముక్కలు చేశామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి కొత్త రూపంగా పేర్కొన్నారు. సమర్థ భారత రౌద్ర రూపమని, ఉగ్రదాడి జరిగితే, మన సమాధానం ఇలాగే ఉంటుందన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి జవాబే దక్కుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
పాకిస్థాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు మన ఎంపీలు విదేశాలకు వెళ్లారని చెప్పారు. పాకిస్థాన్ నిజ స్వరూపాన్ని మన ఎంపీలు ప్రపంచానికి చాటుతారన్నారు. ఇక్కడ మోదీ ఉన్నారనే సంగతి పాకిస్థాన్ మరిచిపోయినట్టుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని ఎయిర్బేస్ను ధ్వంసం చేయాలని పాక్ ప్రయత్నించింది. కానీ, రాజస్థాన్ ఎయిర్బేస్ను పాకిస్థాన్ క్షిపణులు తాకలేకపోయాయన్నారు. మన వాయుసేన మాత్రం పాక్లోని ఎయిర్బేస్లను ధ్వంసం చేసిందని మోదీ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని 86 జిల్లాల్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఆధునీకరించిన 103 రైల్వేస్టేషన్లను ప్రధాని రాజస్థాన్లోని బీకానేర్లో జెండా ఊపి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో బేగంపేట, కరీంనగర్, వరంగల్, ఏపీలో సూళ్లూరుపేట రైల్వేస్టేషన్లు ప్రారంభమయ్యాయి. యూపీలో 19, గుజరాత్లో 18, మహారాష్ట్రలో 15, రాజస్థాన్లో 8 అమృత్ భారత్ స్టేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం రాజస్థాన్లో 26వేల కోట్లతో చేపట్టనున్న వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos