ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఈ మేరకు ధన్ ఖడ్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు సంతకం చేసి లేఖను హోంశాఖకు పంపించారు. కాగా, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా చైర్మన్ హోదాలో జగదీప్ ధన్ ఖడ్ రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించారు. తొలిరోజు కార్యకలాపాలు ముగిసి సభ మంగళవారానికి వాయిదా పడిన తర్వాత ధన్ ఖడ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాష్ట్రపతిని కోరారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్ఖడ్కు అనేక అవకాశాలు లభించాయని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ స్పెషల్ పోస్టు పెట్టారు.
ఇదిలాఉంటే... మరో రెండు సంవత్సరాలు పదవీకాలం ఉండగానే జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. 2022లో ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ కావడంతో ఆయన బెంగాల్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. విపక్ష అభ్యర్థి మార్గరేట్ అల్వాపై విజయం సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 710 ఓట్లకుగాను 528 ఓట్లు గెలుచుకుని 1997 తర్వాత అత్యధిక ఓట్లతో ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos