తిరుపతి టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందడమే కాకుండా 40 మందికి పైగా గాయపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి ఆరోగ్యం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి, వారిని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తోంది. కాగా తిరుమల తిరుపతి ఆలయ కమిటీ అధికారులు టికెట్ల జారీ విధానాన్ని మరింత సజావుగా నిర్వహించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించడానికి తగిన సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు. కాగా.. ఈ ఘటన భక్తుల భద్రతపై మరింత శ్రద్ధ అవసరమని స్పష్టంగా తెలియజేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసం నుంచి తిరుపతికి బయల్దేరారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించనున్నారు. కాగా, ఘటనకు సంబంధించి నివేదిక ఇప్పటికే ఆయన వద్దకు చేరింది. ఘటన అనంతర పరిణామాలపై అధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన తిరుపతి బయల్దేరారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos