లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానంపై ప్రతిపాదించిన చర్చ మంగళవారం హాట్ హాట్ గా ప్రారంభమైంది. సభా సంప్రదాయం ప్రకారం.. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన పార్టీకి తొలుత మాట్లాడే అవకాశం ఇస్తారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్.. లోక్సభ దద్దరిల్లే వ్యాఖ్యలతో మోడీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని ... ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ నేను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు.
ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని ... మణిపూర్ తగులబడుతోందంటే మనదేశం మొత్తం తగులబడినట్లేనని... వివిధ వర్గాల మధ్య ఇంత తీవ్రమైన విద్వేషాన్ని మునుపెన్నడూ చూడలేదని గొగొయ్ ధ్వజమెత్తారు. మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ను ఆ పదవి నుంచి ఎందుకు తొలగించ లేదని నిలదీశారు. ఈ దేశంలో వ్యవస్థలు బాగానే పనిచేస్తున్నాయని... రిక్షా కార్మికుడి నుంచి ఉద్యోగి వరకు అందరిలోనూ చలనం ఉందని... ఇటీవల నేను రెండు చేతుల్లో రెండు రాళ్ళు పట్టుకుని ఒకదానితో ఒకటి రాపిడి చేయగా... వెంటనే అగ్గి రవ్వ ఎగిసి పడిందని.. అంటే వాటిలోనూ చలనం కనిపించిందని గొగొయ్ అన్నారు.
కానీ, ఎటొచ్చీ.. మన ప్రధాన మంత్రిలోనే ఎలాంటి చలనం లేకుండా పోయిందని అన్నారు. ఇలాంటి ప్రధానిని ప్రపంచంలో నేను ఎక్కడా ఏ దేశంలోనూ చూడలేదని గొగోయ్ చేసిన వ్యాఖ్యలతో లోక్సభ పిడుగు పడిన చందంగా నిశ్చేష్టతతో చూస్తుండిపోయింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల జాఢ్యం పెరిగిందని.. గంజాయి సాగు పెరుగుతోందని అన్నారు.
పార్లమెంటులో మాట్లాడరాదనే మౌనవ్రతాన్ని ప్రధాని మోదీ చేపట్టారని, ఆ వ్రతాన్ని భగ్నం చేయాలనే మేము ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పారు. ఇప్పటివరకు మణిపూర్లో ఎందుకు పర్యటించలేదని మోదీని అడుగుతున్నామని చెప్పారు. అస్సాంలో జాతీయ పౌరుల జాబితాను అమలు చేయవలసి ఉందని, ఈశాన్య రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని దుయ్యబట్టారు. మణిపూర్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. వైఫల్యాలను బీజేపీ అంగీకరించవలసిన సమయం ఆసన్నమైంది. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడటం కోసమే మోదీ మౌనంగా ఉన్నారని ఆయన దుయ్యబట్టారు.
మణిపూర్ అంశం నుంచి అదానీ ఆస్తుల వరకు.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ కథనాల నుంచి నిత్యావసరాల ధరల వరకు.. ఒక్కటేమిటి.. రాష్ట్రాల్లో అధికారాలను కైవసం చేసుకునే విషయంలో పన్నుతున్న కుట్రల వరకు గౌరవ్ గొగోయ్ నిప్పులు చెరుగుతుంటే... సభలోనే ఉన్న బీజేపీ ఉద్ధండులు.. రాజ్నాథ్ సింగ్, అమిత్షా సహా అనేక మంది నోరు వెళ్లబెట్టి చూడడమే తప్ప.. నోట మాటలేకుండా పోయింది. ప్రతి వాక్యంలో గొగోయ్ మోడీని టార్గెట్ చేశారు. కాగా... లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు 2 రోజుల్లో మొత్తం 16 గంటల సమయం కేటాయించారు.
బీజేపీకి 6 గంటల 41 నిమిషాలు, కాంగ్రెస్కి 1 గంట 9 నిమిషాలు, డీఎంకేకి 30 నిమిషాలు, తృణమూల్ కాంగ్రెస్ కు 30 నిమిషాలు, వైసీపీకి 29 నిమిషాలు, శివసేనకు 24 నిమిషాలు, జేడీయూకి 21 నిమిషాలు, బీజేడీకి 16 నిమిషాలు, బీఎస్పీకి 12 నిమిషాలు, బీఆర్ఎస్కి 12 నిమిషాలు, ఎల్జేఎస్పీకి 8 నిమిషాలు చొప్పున సమయాన్ని కేటాయించారు. మిగిలిన ఎన్డీఏ అనుకూల పార్టీలు, స్వతంత్ర ఎంపీలకు 17 నిమిషాలు కేటాయించారు. తటస్థ పార్టీలకు 52 నిమిషాల సమయం ఇచ్చారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos