ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా మృతికి వామపక్షాల, పలు మానవ సంఘాల హక్కుల నేతలు నివాళులు అర్పించారు. సీపీఐ నేత నారాయణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని సాయిబాబాకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తకాలు చదివేవారు మేధావులు కాదు.. సమాజాన్ని చదివిన వారు మేధావులని అన్నారు. సాయిబాబాను పదేళ్లు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ చెప్పారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఈ 12వ తేదీ రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వర్సిటీ పరిథిలోని రామ్లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లుగా నాగ్పుర్ జైల్లో శిక్ష అనుభవించారు.
ఈ ఏడాది మార్చిలోనే బాంబే హైకోర్టు ఆధ్వర్యంలోని నాగ్పూర్ బెంచ్ ధర్మాసనం ఆయనను విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన ఆయన సుమారు పది రోజుల కిందట గుండె సంబంధిత సమస్యతో నిమ్స్లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ 12వ తేదీ శనివారం తుదిశ్వాస విడిచారు.
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతదేహానికి హైదరాబాద్ గన్పార్క్ వద్ద సన్నిహితులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. జోహార్ సాయిబాబా అంటూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని నినదించారు. అభిమానుల సందర్శనార్థం గన్పార్క్లో సాయిబాబా భౌతికకాయాన్ని ఉంచిన కుటుంబసభ్యులు అనంతరం మౌలాలి లోని స్వగృహానికి తరలించారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి పార్థివదేహాన్ని అప్పగిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. హక్కుల నిర్బంధమే సాయిబాబా మృతికి కారణమని పౌర హక్కుల సంఘాల నేతలు ఆరోపించారు.
మరోవైపు గన్పార్క్ వద్ద సాయిబాబాకు 5 నిమిషాలు సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు చెప్పడంతో... దీనికి పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసులకు అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. భౌతిక కాయాన్ని అంబులెన్స్లోనే ఉంచి సమావేశం ఏర్పాటు చేస్తామని అభిమానులు చెప్పినా పోలీసులు అంగీకరించలేదు.
కాగా ప్రొఫెసర్ సాయిబాబాను రాజ్యం బలి తీసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఆయన తన మేదస్సుతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ సామాజిక, రాజకీయ చైతన్యాన్ని కలిగిన ప్రొఫెసర్ పై రాజ్యం కక్ష గట్టిందని తెలంగాణ విద్యావంతుల వేదిక తప్పు పట్టింది. తోటి మనిషి గురించి, ప్రకృతి గురించి ఆలోచించే, ఆరాటపడే మనుషులు ఉన్నంతవరకు సాయిబాబా బతికే ఉంటారు. ఆయన నిలబెట్టిన ఎవరెస్టు శిఖరమంత పోరాట స్పూర్తిని,ఆర్తిని,ఆదివాసి పోరాట పటిమను ఎత్తిపడుతూనే ఉంటామని ఆ వేదిక సాయిబాబా కు కన్నీటి జోహార్లు అర్పించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos