భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త వి.శ్రీనివాసన్ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. కోజికోడ్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురై .. కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి అత్యవసర చికిత్స అందించినా ప్రాణాలను నిలపలేకపోయారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసన్ మరణవార్తను కుటుంబసభ్యులు ధృవీకరించారు. శ్రీనివాసన్ కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి. పీటీ ఉష అద్భుతమైన క్రీడా, రాజకీయ ప్రస్థానంలో నిరంతరం అండగా నిలిచారు. అటు క్రీడల్లో, ఇటు రాజకీయాల్లో రాణించడానికి అవసరమైన సహాయ సహకారాలను అందించారు. ఈ రెండు రంగాల్లో ఉష సత్తా చాటడానికి, అనేక విజయాలను అందుకోవడానికి శ్రీనివాసన్ ఓ చోదకశక్తిగా నిలిచారు. ఉషా- శ్రీనివాసన్ దంపతులకు ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన పీటీ ఉషతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. ఈ విషాద సమయంలో ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీనివాసన్ మృతి పట్ల కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉషతో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ అకౌైంట్ లో పోస్ట్ పెట్టారు. పీటీ ఉష భర్త శ్రీనివాసన్ మరణ వార్త విని తీవ్రంగా కలత చెందానని అన్నారు. ఉష, తనయుడు ఉజ్వల్, ఇతర కుటుంబసభ్యులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానని, ఈ కష్ట సమయంలో వారికి శక్తి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos