కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఆయనపై పడిన అనర్హత వేటును ఎత్తివేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మోదీ ఇంటిపేరును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సూరత్ కోర్టు జడ్జి రాహల్ కు రెండేళ్ల జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఆయన ఎంపీగా అర్హతను కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో అప్పీలు చేసినప్పటికీ అక్కడ రాహుల్ కు ఊరట లభించలేదు. కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఆ మరుసటి రోజు రాహుల్పై పార్లమెంట్ సెక్రటేరియేట్ అనర్హత వేటు వేసింది. ఈ కేసులో రెండేళ్ల జైలుశిక్షను రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో న్యాయస్థానం తాజాగా స్టే విధించింది. సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు లోక్సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది. దీంతో రాహుల్ ఎంపీగా మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టారు. రాహుల్ మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందంతో ... తన సహచర నేతలకు మిఠాయిలు పంచిపెట్టారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎంపీగా అర్హత సాధించిన రాహుల్ .. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ పాల్గొనేందుకు అవకాశం లభించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos