తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ నుండి బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన సీఎం రమేష్, టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, వైఎస్ఆర్సీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియనుంది. దీంతో రాజ్యసభ ఎన్నికలు అనివార్యమయ్యాయి. దేశంలోని 15 రాష్ట్రాల్లో 56 స్థానాల్లో రాజ్యసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15న నామినేషన్ల దాఖలుకు చివరి తేది. 20న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేది. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. 29వ తేదీ లోపుగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో 56 మంది సభ్యులు రిటైర్ కానున్నారు. ఆ స్థానాలను భర్తీ చేయడానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ ఛత్తీస్ ఘడ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల నుండి రాజ్యసభ సభ్యులు రిటైర్ కానున్నారు. కాగా వైసీపీ తరఫున ముగ్గురు అభ్యర్ధులూ దాదాపు ఖరారయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అరణి శ్రీనివాసులతో పాటు వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నారు. మరోవైపు టీడీపీ కూడా ఈసారి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న టీడీపీకి ప్రస్తుతం అసెంబ్లీలో కనిపిస్తున్న వాస్తవ బలం 18 మాత్రమే. గతంలో ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేల్ని గెలిచినా నలుగురు వైసీపీకి ఫిరాయించడం, ఓ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఇప్పటికే ఆమోదించడంతో 18 మంది మాత్రమే మిగిలారు. అయితే వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన మరో నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. అయితే దీంతో సంబంధం లేకుండానే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకుని రాజ్యసభ సీటు గెల్చేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో టీడీపీ తరఫున పోటీ చేసే రాజ్యసభ అభ్యర్ధి ఎంపికపై దృష్టిసారించింది. గతంలో ఓసారి ఇలాంటి పరిస్దితుల్లోనే రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయిన వర్ల రామయ్యతో పాటు కోనేరు సురేష్ ను రాజ్యసభ అభ్యర్ధిగా పరిశీలిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరికి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం లభించనుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos