పరువు నష్టం దావా కేసులో ఎట్టకేలకు లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహుల్ని దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతోనే రాహుల్ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందన్న వాదనల నేపథ్యంలో సర్పోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ కు ఉపశమనం కలిగించింది. గుజరాత్ న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టేను విధించింది. ఈ కేసులో గరిష్ఠంగా.. లోక్సభ సభ్యుడిగా అనర్హత వేటు విధించడానికి గల కారణాలను దిగువ కోర్టు న్యాయమూర్తి వెల్లడించలేకపోయారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తుది తీర్పు పెండింగ్లో ఉన్నందున దోషిగా నిర్ధారించే వరకు రాహుల్ గాంధీపై జారీ చేసిన క్రిమినల్ పరువునష్టం దావా ఉత్తర్వులను నిలిపి వేయనున్నట్లు ఆదేశించింది. ఈ తీర్పుతో రాహుల్ గాంధీ మళ్లీ లోక్సభలో అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆయన సభలో ఎంట్రీ ఇవ్వబోతోన్నారని సమాచారం. కాగా.. మోదీ ఇంటిపేరు వ్యవహారంలో గతంలో రాహుల్ గాంధీని.. సూరత్ న్యాయస్థానంలో దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. అప్పుడూ అదే తీర్పు వెలువడింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. దీనితో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. రాహుల్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన పూర్ణేష్ మోదీ ఇంటి పేరు ... మోదీ కాదని, అది భూటాల అని వివరించారు. అలాంటప్పుడు ఇది పరువు నష్టం కిందకు ఎలా వస్తుందని వాదించారు అభిషేక్. దేశంలో మోదీ ఇంటి పేరుతో 13 కోట్ల మంది ఉన్నారని, కానీ కేవలం బీజేపీకి చెందిన వాళ్లు మాత్రమే దీనిపై అనవసరంగా రియాక్ట్ అవుతున్నారని అన్నారు. ఈ కేసులో కావాలనే రాహుల్ గాంధీకి గరిష్ఠ శిక్ష వేశారని వాదించారు. ఈ కారణంగా ఆయన 8 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇదంతా కుట్ర అని వాదించారు సింఘ్వీ. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు...రాహుల్ని దోషిగా తేల్చిన తీర్పుపై స్టే విధించింది. రాహుల్కి రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి సరైన కారణమేదీ ట్రయల్ కోర్టు చూపించలేదని జస్టిస్ పీకే మిశ్రా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అత్యంత సంతోషకరమైన రోజుగా అభివర్ణించింది. 2019 నాటి ఎన్నికల ప్రచార సమయంలో కర్ణాటకలోని కోలార్లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ... మోదీపై విమర్శలు చేసే సందర్భంలో... బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరస్తుల పేర్ల చివరన మోదీ అని ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. అదే ఇప్పుడు ఆయనపై అనర్హత వేటుకు దారి తీసింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో రాహుల్ కు బిగ్ రిలీఫ్ లభించడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos