నిన్నమొన్నటివరకు ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్ ను ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు మన దేశాన్ని నిఫా వైరస్ అనే మరో వ్యాధి వేధిస్తోంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా అప్రమ్తమవుతున్నాయి. అనవసరంగా కేరళ ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా... మన రాష్ట్రంలో... ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రస్తుత సత్యసాయి జిల్లాలో మరో కొత్తవ్యాధి సోకి స్థానికులను భయకంపితుల్ని చేస్తోంది. జిల్లాలోని ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన 20 ఏళ్ల వయసున్న గవ్వల మధు అనే యువకుడు ‘స్క్రబ్ టైపస్’ అనే వ్యాధితో మృతి చెందడం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. ఇలాంటి వ్యాధితో ఒకరు మరణించడం జిల్లాలో ఇదే తొలిసారి. 15 రోజుల క్రితం మధు జ్వరం బారినపడడంతో ధర్మవరం, అనంతపురంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత నెల 31న చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచాడు. మధు స్క్రబ్ టైపస్ వ్యాధితోనే మృతి చెందినట్లు ప్రచారం జరగడంతో అప్రమత్తమైన జిల్లా వైద్యాధికారులు వెంటనే మధు స్వగ్రామమైన పోతుకుంటకు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఆసుపత్రి రికార్డుల్లో మధు స్క్రబ్ టైపస్తోనే మృతి చెందినట్లు ఉండడాన్ని ఈ బృందం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. ఇది ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, కీటకం కుట్టడం ద్వారా మనిషికి సోకుతుందని తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు గ్రామంలో కీటక నివారిణి స్ప్రే చేశారు. మధు కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు. జిల్లాలో ఇప్పటికే మూడు కేసులు నమోదు అయ్యాయి. అందులో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే కొత్త రకం జ్వరానికి సంబంధించి లక్షణాలు బయటకు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. బెంగుళూర్ ఆస్పత్రి నివేదికను వైద్యాధికారులు పరిశీలిస్తున్నారు. తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్యలు చేపట్టారు. ఈ వైరస్ ఇతర జిల్లాలకు వ్యాపించకుండా రాష్ట్ర వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos