కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. సోనియా గాంధీ నిన్న అస్వస్థతకు గురయ్యారు. అయినా ... పార్టీలో కురువృద్ధుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు మన్మోహన్ నివాసానికి వచ్చారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ ఉన్నారు.
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.
అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈరోజు ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos