కర్ణాటకలో అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- జనతాదళ్ (సెక్యులర్) కూటమి మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఎవరిది పైచేయి అనేది నవంబర్ 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోనుంది.
రాష్ట్రంలో మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. బెంగళూరు దక్షిణ (రామనగర) జిల్లా చెన్నపట్న, హవేరి జిల్లా షిగ్గావ్, బళ్లారి జిల్లాలోని సండూరు స్థానాలకు నవంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రులు హెచ్ డీ కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ ఎమ్మెల్యే తుకారాం ప్రాతినిథ్యాన్ని వహించిన నియోజకవర్గాలు అవి. ఈ ముగ్గురూ లోక్సభకు ఎన్నికైనందున ... తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితంగా ఈ మూడు సీట్లకూ ఉప ఎన్నిక అవసరమైంది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్లో కుమారస్వామికి బెర్త్ లభించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై తాము ఖాళీ చేసిన స్థానాల్లో వారసులను బరిలో దింపారు. చెన్నపట్నలో జేడీఎస్- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రముఖ నటుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు.. ఇదే చెన్నపట్న నుంచి బీజేపీకి చెందిన మాజీ మంత్రి సీపీ యోగేశ్వర్.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షిగ్గావ్లో బసవరాజ్ బొమ్మై తనయుడు భరత్ బొమ్మై బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగారు. సండూర్ స్థానాన్ని బీజేపీ బంగారు హనుమంతుకు కేటాయించింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి తుకారాం భార్య అన్నపూర్ణ పోటీ చేస్తున్నారు. ఈ మూడు స్థానాలు కూడా కుటుంబ సభ్యులకే దక్కడం హైలైట్.
ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్బంగా తేటతెల్లమవుతుంది. నిఖిల్ కుమారస్వామి ఇప్పటివరకు రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరాజయమే ఎదురైంది. 2019 నాటి ఎన్నికల్లో మండ్య లోక్సభ, 2023 అసెంబ్లీ పోరులో రామనగర నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి మరి
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos