తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రసంగించే భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం. ఈ నెల 17వ తేదీన అధికారికంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేరనున్నారు. అదేరోజు మైనంపల్లి ... ఆయన కుమారుడితో కలిసి కాంగ్రెస్ లో చేరుతారని సమాచారం.
పార్టీ విజయ భేరీ సభను హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 17న జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ సీనియర్ అధినేత్రి సోనియా గాంధీ ఐదు ఎన్నికల హామీలను ప్రకటించబోతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లకు తమ హామీలను వివరిస్తూ కాంగ్రెస్ ఇప్పటికే 'రైతు డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ వంటి పలు ప్రకటనలను విడుదల చేసింది. ఇదిలావుండగా... భారీ బహిరంగసభ జరిగే రోజు కన్నా ఒకరోజు ముందు అంటే 16వ తేదీన... పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొదటి సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 17న జరిగే విజయ భేరి సభను విజయవంతం చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ప్లాన్ చేశారు.
తెలంగాణలో ఈ ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 16తో ముగియనుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఇప్పటికే మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఇంకా... దరఖాస్తులు సేకరించే పనిలోనే నిమగ్నమై ఉంది. ఈ నేపథ్యంలో ఇక తమ పార్టీ అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నెల 17న బహిరంగ సభ తరువాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos