ప్రముఖ నటి త్రిష కృష్ణన్పై తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు చిలికి చిలికి గాలీవానగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్తో త్రిషను ముడిపెడుతూ ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ రంగు పులుముకున్నాయి. బీజేపీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వీటికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది ఆ పార్టీ నాయకులకు. త్రిష నుంచి బయటకు వస్తేనే విజయ్ రాజకీయంగా ఏదైనా సాధిస్తాడని నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. విజయ్కి ఏమీ తెలియదని, ఎటువంటి అనుభవం లేదని, ముందు అతను ఇంట్లో నుండి బయటకు రావాలని, త్రిషతో ఉన్న సంబంధాల నుండి బయటపడితేనే వాస్తవాలను చూడగలడని పేర్కొన్నారు. ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి ప్రయత్నించే ముందు విజయ్ తన కుటుంబ సంబంధాలను సరిచేసుకోవాలని సూచించారు. విజయ్ తీరుపై ఇంకా పలు సెటైర్లు వేశారు.
విజయ్ తో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయంటూ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యల పట్ల త్రిష ఘాటుగా స్పందించారు. త్రిష తరఫున ఆమె న్యాయవాది నిత్యేష్ నటరాజ్ ఓ ప్రకటన జారీ చేశారు. మీడియాలో తన క్లయింట్పై జరుగుతున్న ప్రచారంలో ఉన్న వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానంలో ఉన్న ఓ నాయకుడి నుంచి ఇటువంటి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యానికి, బాధకు గురి చేసిందని నటరాజ్ తెలిపారు. త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని, భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఆమెకు లేదని స్పష్టతనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె గతంలో అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. త్రిష రాజకీయ విషయాల్లో తటస్థ వైఖరిని అవలంబిస్తారని పునరుద్ఘాటించారు. తనను నటిగా మాత్రమే గుర్తించాలని, ఎలాంటి రాజకీయ సంబంధాలతో ముడిపెట్టవద్దని సూచించారు. వ్యక్తిగత జీవితాలను బహిరంగ చర్చకు తీసుకురావడం సరికాదని, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజా రంగంలో బాధ్యతాయుతంగా, విజ్ఞతతో వ్యవహరించాలని త్రిష హితవు పలికారు. సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos