అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడం తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతలో ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. ఎయిరిండియా ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళ్తున్న ఎయిరిండియా విమానం 171 ఈ రోజు విషాదకరమైన ప్రమాదానికి గురైందని తెలియజేయడానికి మేము చాలా విచారంగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రకటన విడుదల చేసింది. ఈ భయంకరమైన ఘటనతో ప్రభావితమైన కుటుంబాలకు, తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటించింది. కంపెనీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టు ప్రకారం ఎయిరిండియా ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇలా అన్నారు. "బాధిత ప్రజలకు, వారి కుటుంబాలకు సహాయం చేయడమే మా మొదటి ప్రాధాన్యత. మేము ఘటనా స్థలంలో ఉన్న అత్యవసర బృందాలకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తున్నాం. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం, సంరక్షణ అందించడానికి కూడా మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. మాకు మరింత ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే మేము మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాం. కుటుంబాలకు సమాచారం అందించడానికి అత్యవసర కేంద్రం ప్రారంభించబడింది. అలాగే ఒక సహాయక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బృందం కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ఎయిరిండియా అందరికీ తోడుగా ఉంది. మేము అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామని" ప్రకటించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos