తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో పాగావేసేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ప్రచారంలోనూ దూకుడు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వరుసగా పార్లమెంట్ స్థాయిలో బూత్ అధ్యక్షుల సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12న వరంగల్, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 13వ తేదీన అదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో. 14వ తేదీన పెద్దపల్లి, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 15వ తేదీన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ లో బూత్ అధ్యక్షుల సమ్మేళనాన్ని కమల నాథులు పూర్తి చేశారు. బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయిలో నేతలతో సమావేశాల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. 17వ తేదీన లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో.. 20వ తేదీ తరువాత పార్టీ జాతీయ స్థాయి నేతలు భారీ స్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో మూకుమ్మడిగా ప్రచారం చేసేందుకు బీజేపీ అగ్రనాయకత్వం ప్లాన్ చేస్తోంది. దేశంలో ఎన్నికలు పూర్తయిన ప్రాంతాల నుంచి ముఖ్యనేతలు తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. మొత్తానికి 20వ తేదీ తరువాత రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరెత్తనున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos