భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ - 3 సురక్షితంగా ల్యాండింగ్ అయ్యే సమయం రానే వచ్చింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ సరిగ్గా సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిని ముద్దాడనుంది. ఇందుకోసం ప్రతి భారతీయుడు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా దిగితే చందమామ పైకి ల్యాండర్ పంపిన నాలుగోదేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రయోగాల్లో ఇది కీలక ముందడుగుగా రికార్డ్ అవుతుంది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అభివృద్ధి చెందిన అగ్ర దేశాల సరసన నిలుస్తున్నది. నాసా, రష్యా, చైనాల తర్వాత నాలుగోస్థానంలో మనదేశమే విరాజిల్లుతున్నది. మరో విషయం ఏమిటంటే... ఈ దేశాలు ఖర్చు పెట్టిన దాని కంటే తక్కువ మొత్తంతోనే ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది. ఈ చంద్రయాన్ మిషన్ తీసుకున్నా అంతే. నాసా చేపట్టిన ఆర్టెమిస్ అయినా.. రష్యా ఇటీవల పంపిన మిషన్ అయినా.. చంద్రయాన్ కంటే ఖరీదైన ప్రాజెక్టులే. ఆ దేశాలు అత్యధిక ఫ్యుయెల్ ఉపయోగించి భూమి, చంద్రుడి ఆకర్షణలను కాదని నేరుగా వెళ్లిపోతాయి. అయితే.. చంద్రయాన్ మాత్రం తక్కువ ఇంధనపు ఖర్చుతో భూమి చుట్టూ ... అలాగే చంద్రుని చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేసి వాటి ఆకర్షణను ఉపయోగించుకుంటుంది. ఇదిలావుండగా... చంద్రుడిపై అధ్యయనాలు చేయడానికి చంద్రయాన్ మిషన్ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చంద్రయాన్ 1ను 2008లో ప్రయోగించగా... ఈ ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రయాన్ 1లో ఆర్బిటర్, ఇంపాక్ట్ ప్రోబ్ను ప్రయోగించింది. ఇంపాక్ట్ ప్రోబ్ అక్కడి ఖనిజాల మ్యాప్ ను రెడీ చేసింది. ఈ మ్యాప్ ద్వారానే చంద్రుడిపై వాటర్ కంటెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చెప్పింది. ఆ తర్వాత చంద్రయాన్ 2 మిషన్ను 2019లో ఇస్రో ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, రోవర్ను చంద్రుడి మీదికి ప్రయోగించింది. ఆర్బిటర్ సరిగ్గానే చేరుకుంది కానీ... విక్రమ్ సేఫ్గా ల్యాండ్ కాలేదు. దీంతో అది ధ్వంసమైంది. రోవర్ బయటకు రాకుండానే మిషన్ ముగిసిపోయింది. దీంతో ఇస్రో మరోసారి అదే ప్రయోగాన్ని లోపాలను సరిదిద్ది ... ఈ ఏడాది జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3... ఈ రోజు సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు చంద్రుడి ఉపరితలంపై సేఫ్ గా ల్యాండ్ కానుంది. అందులో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటికి వచ్చి దక్షిణధ్రువం వద్ద తిరుగుతుంది. తద్వారా దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ల్యాండర్ సేఫ్గా ల్యాండ్ అయిన తరువాత... రోవర్ను బయటికి రప్పించి జాబిల్లి పై తిప్పడమే చంద్రయాన్ 3 ప్రధాన లక్ష్యంగా ఉంది. చంద్రయాన్ 3 తర్వాత కూడా పలుసంఖ్యలో మిషన్లను ప్రయోగించనుంది. రోవర్ అక్కడ తిరగడమే కాదు.. ఖనిజాలను పరిశీలించడం, చంద్రుడి మీద ఖనిజాలను తవ్వి తీయడం, ఆ తవ్వి తీసిన ఖనిజాలను భూమి పైకి తీసుకురావడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. రోవర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేసే విషయంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషికి ఫలితం దక్కినట్లేనని నిపుణులు చెబుతున్నారు. తదుపరి ప్రయోగాలకు ఇదెంతో కీలకంగా మారుతుందని వారు అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos