ఇంతకాలం మనవెంటే ఉంటూ... మన అవసరాలు తీరుస్తూ అండగా నిలిచిన ఓ పెద్ద నోటు ... మనల్ని వదిలేసి .... తన దారిన తాను వెళ్లిపోతోంది. మానవజాతికి మధుర స్మృతులను పంచి బహుదూరపు బాటసారిలా కాలగర్భంలో కలిసిపోతోంది. 2000 రూపాయల నోట్లు మార్చుకునే గడువు శనివారంతో ముగుస్తోంది. ఆర్బీఐ సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 డినామినేషన్ బ్యాంక్ నోటు చెల్లదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా.. రూ. 2000 నోట్లను 2016 నవంబర్ లో తీసుకొచ్చారు. అంతకుముందే, చలామణిలో ఉన్న మొత్తం రూ.500... రూ.1000 నోట్ల చట్టబద్ధతను రద్దు చేశారు. దీంతో, ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన నోట్ల కొరతను తీర్చడానికి రూ.2000 నోట్ల డినామినేషన్ను ఆర్బీఐ తీసుకువచ్చింది. ఇప్పుడు, ఇతర డినామినేషన్ల నోట్లు కూడా తగినన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి... 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. దీంతో, 2018-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణను ఆర్ బీఐ నిలిపేసింది. ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్లను చెలామణి నుంచి తీసివేసింది. నోట్లను మార్చుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఈ నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఈ రోజే అంటే సెప్టెంబర్ 30 చివరి తేదీ చివరిరోజు. ఈ రోజు 5వ శనివారం బ్యాంకులు పనిచేస్తాయి. మీ వద్ద ఇప్పటికీ రూ.2000 నోట్లు ఉంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్కి వెళ్లి వాటిని మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. ఖాతా లేని వ్యక్తి ఏదైనా బ్యాంక్ బ్రాంచిలో ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. కాగా... నేడు గడువు ముగుస్తున్న వేళ వీటిని ఏం చేయాలనే దానిపై అక్టోబర్ 1న రిజర్వు బ్యాంక్ కీలక ప్రకటన విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. క్లీన్ నోట్ పాలసీ కింద పెద్ద నోట్లను ఇప్పటికే వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. దీని కింద 93 శాతం రూ.2000 నోట్లు తిరిగి బ్యాంకులకు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos