తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో... కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉండగా... దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులది మరో ప్రాబ్లమ్. వారిని రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్ డిక్లరేషన్ భయపెడుతోంది. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు కోరుతున్న నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం టిక్కెట్లు కేటాయిస్తుందా లేదా అనేది ఆసక్తికర చర్చగా సాగుతోంది. గతంలో తీర్మానించిన ఉదయ్ పూర్ డిక్లరేషన్ ... రెండు టిక్కెట్లు కోరుకొనే వారికి ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అయితే ప్రత్యేక మినహాయింపులతో తమకు రెండు టిక్కెట్లు ఇవ్వాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ అంశంపై ఒక్కో కేసు గురించి వరుసగా చర్చిద్దాం..
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఆయన భార్య పద్మావతి రెడ్డికి కూడా కాంగ్రెస్ టిక్కెట్లు కోరుతున్నారు. 2018 ఎన్నికల్లో వీరిద్దరికి కాంగ్రెస్ నాయకత్వం టిక్కెట్లు కేటాయించింది. ఇప్పుడు కూడా వీరిద్దరు మరోసారి ధరఖాస్తు చేసుకున్నారు. వీరి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. మరో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యవహారమేమిటో చూద్దాం. జానారెడ్డి ఇద్దరు కొడుకులు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ధరఖాస్తు చేస్తుకున్నారు. పెద్దకొడుకు రఘువీర్ రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి దరఖాస్తు చేసుకున్నారు. చిన్న కొడుకు జయవీర్ రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి అదే కాంగ్రెస్ టికెట్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ దఫా జానారెడ్డి మాత్రం టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.
2018 ఎన్నికల్లో కూడా జానారెడ్డి ఆయన పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ... నాగార్జునసాగర్ నుండి జానారెడ్డికి మాత్రమే టిక్కెట్టు దక్కింది. వీరిద్దరిలో అధిష్టానం ఈసారి ఎవరికి టికెట్ ఇస్తుందనేదానిపై చర్చించుకుంటున్నారు. మరోవైపు... రెండురోజుల క్రితం రాజీనామా చేసిన బీఆర్ఎస్ కు చెందిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.
మైనంపల్లికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ దక్కినా... ఆయన కొడుకు రోహిత్ మెదక్ నుండి పోటీ చేసేందుకు నిరాకరించి... టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో... పార్టీ అధిష్టానం రెండు టికెట్లు ఆయన కుటుంబానికి కేటాయిస్తుందా అనేది సందేహాస్పదమే. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అడ్డుపడే అవకాశం ఉంది. రెండు టిక్కెట్ల కోసమే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న మైనంపల్లి కి ఇది గట్టి షాక్ లాంటి వార్తనే. ఈ పరిస్థితుల్లో మైనంపల్లి ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ టిక్కెట్లను రేఖానాయక్ కుటుంబం కోరుతోంది. రేఖానాయక్ ప్రస్తుతం ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈ దఫా బీఆర్ఎస్ టిక్కెట్టు ఆమెకు దక్కలేదు. దీంతో రేఖానాయక్ భర్త శ్యాంనాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆసిఫాబాద్ టిక్కెట్టు కోసం ఆయన ధరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ నుండి రేఖానాయక్ కూడా కాంగ్రెస్ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేశారు. వీరిద్దరికి టికెట్లు కేటాయించే విషయమై కాంగ్రెస్ పార్టీ ఏం డిసైడ్ చేస్తుందోననే చర్చ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ నాయకత్వం ... ఎంతమంది ఆశలను అడియాసలు చేస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos