ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ, జనసేన పొత్తు అధికారికమైంది. చంద్రబాబును కుట్ర పూరితంగా జైలులో పెట్టారని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాను చంద్రబాబుకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ ప్రకటించి... బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయం ఇంత హాట్ హాట్ గా నడుస్తున్న సమయంలో వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పెంచాయి. ఇండియా కూటమిలో టీడీపీ చేరుతుందని ... ఇప్పటివరకు చంద్రబాబుకు మద్దతిస్తూ నారా లోకేశ్ కు ఫోన్ కాల్స్ చేస్తోంది కేవలం కూటమిలో ఉన్న పార్టీలకు చెందినవారేనని... దీన్నిబట్టి ఇండియా కూటమిలో టీడీపీ కూడా ఉందని నిరూపితమవుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు కు మద్దతుగా ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ స్పందించారు కానీ... ఎన్డీఏ నుంచి ఎలాంటి స్పందన లేదని... ఇక ఇండియా కూటమితోనే టీడీపీ కొనసాగుతుందంటూ విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. వీళ్లందరి ఉమ్మడి ప్రణాళిక ఒక్కటేనని, అధికారం కోసం చేతులు కలపడం, అందినకాడికి రాష్ట్రాన్ని దోచేయడమేనని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్కిల్ అవినీతి వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధమే లేదంటూ ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ కేంద్రంగా వాదన వినిపిస్తున్నారు. ఇదిలావుండగా... 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి పొత్తు పైన స్పష్టత రాలేదు. ఈ సమయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తనంతట తాను టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos