తెలంగాణలో ఎన్నికల వాతావరణం హాట్ హాట్ గా మారుతోంది. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల వ్యూహరచన మొదలుపెట్టాయి. కదనరంగంలో నేతలంతా పూర్తిగా క్రియాశీలకమయ్యారు. ప్రధాన పార్టీల అధినాయకత్వాలు ... ఎవరికి వారు సర్వేలు చేయించుకుని... ఎక్కడెక్కడ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో లెక్కలుకడుతున్నాయి. కర్ణాటకలో ఇచ్చిన గెలుపు జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ... తెలంగాణలో కూడా అదే ఊపును కొనసాగించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈసారి ఎలాగైనా తెలంగాణను హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. గెలిచే అభ్యర్థుల వేట మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ సర్వే చేపట్టి కీలక రిపోర్టును ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్కి అందజేసింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఈ టీమ్ నివేదికను రూపొందించింది. పార్టీ గెలుచుకునే అసెంబ్లీ స్థానాలను మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీలోని స్థానాలను కాంగ్రెస్ పార్టీ గన్షాట్గా గెలుచుకుంటుందని సునీల్ కనుగోలు టీమ్ అంచనావేసింది. ఇక బీ కేటగిరీలో కొంచెం కష్టపడితే గెలిచే స్థానాలుగా పేర్కొంది. సీ కేటగిరీ సీట్లలో బలహీనంగా ఉందని పేర్కొన్నారు. బీ కేటగిరీ స్థానాల్లో గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందని రిపోర్ట్లో సూచించారు. బీ కేటగిరీ సీట్లలో బలం పెంచుకునేందుకు పార్టీ నేతలకు సునీల్ టీమ్ దిశానిర్దేశనం చేసింది. ఈ నెలలోనే మొదటి జాబితాలో కొన్ని అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే బీఆర్ఎస్లో కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎం కేసీఆర్ కూడా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందని చర్చ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ... ఇక పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటించే కార్యక్రమంలో బిజీ అయారన్న మాట.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos