జాతీయ రాజకీయాల్లో కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఏయే పార్టీలు చేరతాయనే అనుమానాలు నెలకొన్న క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ... ఆ కూటమిలో చేరతారా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు. ఇండియా లేదా ఎన్డీఏలో ఎవరి పక్షాన కూడా భారత రాష్ట్ర సమితి ఉండబోదని ... బీఆర్ఎస్ ఒక్కటిగా లేదని మాతో చాలా పార్టీలు కలిసి వస్తాయని కేసీఆర్ అన్నారు. 50 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్... ఎలాంటి మార్పు తీసుకు వచ్చిందని... మార్పు రావాల్సింది పార్టీల్లో కాదని దేశంలో మార్పు రావాలని కేసీఆర్ అన్నారు.
ఇదివరకు దేశంలో అధికారంలో ఉన్నవారే ఆ కూటముల్లో ఉన్నారని, కానీ దేశంలో మార్పు ఏమీ లేదని ... దేశంలో ఒక కొత్త మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని, అది ఈ రెండు కూటములతో రాదని పేర్కొన్నారు. అందుకే తాము ఈ రెండు కూటములకు దూరంగా ఉంటున్నామని కేసీఆర్ చెప్పారు. ఆ కూటముల్లో చేరాల్సిన అవసరం మాకు లేదని ... అలాగని, తాము ఒంటరిగా ఏమీ లేమని మాతో నడిచే మిత్రులూ ఉన్నారని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల కోసం బీఆర్ఎస్ శంఖారావం పూరిచిందని... వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తోందని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 14.10 లక్షల మందితో కూడిన బ్రిగేడ్ను ఏర్పాటు చేసిందని.. వారు ఇప్పటికే మహారాష్ట్రలో గ్రౌండ్ లెవెల్ లో పని ప్రారంభించారని... 50 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మహారాష్ట్రలో సంపదకు, వనరులకు కొదవ లేదని ... అద్భుతమైన వనరులు, ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. కానీ, వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఆరోపించారు.
ఏ పట్టణానికి వెళ్లినా తాగునీటి కొరత ఉన్నదని అన్నారు. కాగా.. దళిత సంఘాల నిరంతర పోరాటాలపై బీఆర్ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, మహారాష్ట్రలో దళితులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అంతకు మందు ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రముఖ కవి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠే మహారాష్ట్ర యుగకవి అని, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరుగాంచారని అన్నారు. రష్యా లాంటి పెద్ద దేశమే అన్నాభావు సాఠేని గుర్తించిందని కేసీఆర్ గుర్తించారు.
కానీ మన దేశమే ఆ మహానుభావుడిని సరిగ్గా గుర్తించలేదని అన్నారు. రష్యాలోని మెయిన్ లైబ్రరీలో అన్నాభావు సాఠే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని... ఆయన రచనలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని కేసీఆర్ అన్నారు. అన్నాభావు రచనలు అన్ని భాషల్లోకి అనువదించాలని కోరారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ... మహారాష్ట్రలో పార్టీ వేగంగా విస్తరిస్తున్నదని... రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో మా సత్తా చాటుతామని దీమా వ్యక్తం చేశారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos