దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 20న ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను నిర్ణయించలేదు కానీ .. ఆ కార్యక్రమం రాంలీలా మైదానంలో జరిగే అవకాశం ఉంది. తొలుత ఫిబ్రవరి 17న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాలని భావించినా తర్వాత వాయిదా వేశారు. సీఎం పేరును నిర్ణయించే ముందు పార్టీ తన ఎమ్మెల్యేలతో ఈ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
ముఖ్యమంత్రి ఎంపికక సంబంధించి గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నాయకత్వం మౌనంగా ఉన్నప్పటికీ.. పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, రేఖా గుప్తాతో సహా అనేక మంది పేర్లపై ఊహాగానాలు వస్తున్నాయి. రేసులో ఉన్న పేర్లలో పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయన న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించారు. కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, జనక్ పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ పేరు కూడా చర్చనీయాంశమవుతోంది. మహిళా నేతలలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా కూడా సీఎం పదవికి పోటీదారుగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరైన,ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా పేరు కూడా జాబితాలో ఉంది.
మాలవీయ నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ కూడా రేసులో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కు బలమైన ప్రతినిధి అయిన జితేంద్ర మహాజన్ కూడా సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ అధిష్ఠానం ఒక మహిళను లేదా పూర్తిగా కొత్త ముఖాన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు సూచనప్రాయంగా చెబుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ను ఓడించి గెలిచిన శిఖా రాయ్ పేరును కూడా సీఎం పదవికి పరిగణిస్తున్నట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos