అహమ్మదాబాద్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం తర్వాత ప్రయాణికులు జర్నీ అంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాల బుకింగ్లు దాదాపు 20 శాతం మేర తగ్గాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (IATO) అధ్యక్షుడు రవి గోసైన్ ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఎయిర్లైన్ సగటు ఛార్జీలు కూడా ఎనిమిది నుండి 15 శాతం తగ్గాయని ఆయన అన్నారు. అయినప్పటికీ బుకింగ్స్ ఏ మాత్రం పెరగలేదని చెప్పుకొచ్చారు. ప్రయాణికులు విమానాల జర్నీపై అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఈ విమాన ప్రమాదం తర్వాత విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో తగ్గుదల కనిపించింది. వారు బుకింగ్ చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అంతర్జాతీయ బుకింగ్లు దాదాపు 18-22 శాతం, దేశీయ బుకింగ్లు 10-12 శాతం తగ్గాయని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో పరిస్థితుల్లో మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది తాత్కాలికమేనని ఫ్యూచర్ లో బుకింగ్ లు పెరుగుతాయని విశ్వసిస్తున్నామని, పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామని తెలిపారు. కీలకమైన ఎయిర్ ఇండియా రూట్లలో ఛార్జీలు కూడా సర్దుబాటు చేశామని చెప్పుకొచ్చారు.
దేశీయ రంగాలలో టికెట్ ధరలు సగటున ఎనిమిది నుండి 12 శాతం తగ్గాయని, ఇండిగో, అకాసా వంటి బడ్జెట్ క్యారియర్లతో ఎయిర్ ఇండియా నేరుగా పోటీ పడుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్గాల విషయానికి వస్తే.. యూరప్, ఆగ్నేయాసియాకు ఛార్జీలు 10-15 శాతం తగ్గాయని, అయినా బుకింగ్ పెరుగుదల కనపడటం లేదని తెలిపారు. గత వారంలో అంతర్జాతీయంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్న వారి 15-18 శాతం పెరిగిందని తెలిపారు. దేశీయంగా ఎనిమిది నుండి 10 శాతం ఈ సంఖ్య పెరిగిందని తెలిపారు.
రాబోయే రోజుల్లో బుకింగ్ లు మరింతగా పెరుగుతాయని, ఎయిర్ ఇండియా విమానంలో వ్యవస్థాపరంగా ఎటువంటి భద్రతా సమస్యలు లేవని..ఈ విషయాన్ని DGCA అధికారులు తెలిపారన్నారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించారని ఆయన చెప్పుకొచ్చారు. ఎయిర్ ఇండియాకు చెందిన మరో ఉన్నతాధికారి మాట్లాడుతూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అన్ని ఎయిర్ ఇండియా విమానాలు, ముఖ్యంగా బోయింగ్ 787, ఎగరడానికి సురక్షితంగా ఉన్నాయన్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాలపై ముందు జాగ్రత్తగా తనిఖీలను పూర్తి చేసామని, ఈ విమానం అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు DGCA బహిరంగంగా ప్రకటించిందని అన్నారు. అయినప్పటికీ దర్యాప్తు తర్వాత ఎయిర్ ఇండియా విమానాలను ముందు జాగ్రత్త చర్యగా బయలు దేరే ముందు అన్ని తనిఖీలను కొనసాగిస్తుందని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos