ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీలు, పరిశ్రమలు క్యూకట్టాయి.  ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పరిశ్రమకు సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన కోసం ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏఎంఎన్‌ఎస్‌ (ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా) సంస్థ అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మార్చి 7న శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఏఎంఎన్‌ఎస్‌ యాజమాన్యం శంకుస్థాపనకు సంబంధించిన వివరాలను ‘ఎక్స్‌’ ద్వారా ప్రకటించింది.

చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పేర్కొంది. ట్వీట్‌లో శంకుస్థాపనకు సంబంధించి కంపెనీ ఫోటోతో పాటుగా, గూగుల్‌ మ్యాప్, ఇతర వివరాలను కూడా ప్రస్తావించింది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు హాజరవుతారనే చర్చ జరుగుతోంది.. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న నక్కపల్లి మండలంలో ఆ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో పాటుగా అధికారులు భద్రతా ఏర్పాట్లను  పరిశీలించారు.

దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌‌ను దాదాపు రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ పరిశ్రమను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఎకరా రూ.51,39,690 ధరకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో 2,200 ఎకరాలు కేటాయించారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్యాకేజీ కూడా ప్రకటించింది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ తొలిదశ ప్రాజెక్టు పురోగతిని బట్టి రెండోదశ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ఉంటుంది. మొత్తం మీద ఆర్సెలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మరో ముందడుగు పడబోతోంది.

Related Videos