ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రాయవరం పులి ఎపిసోడ్ ఎట్టకేలకు ముగిసింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాడుబడిన పాత ఇంట్లో బెంగాల్ టైగర్ను అటవీ శాఖ అధికారులు , పోలీసులు నిన్న శుక్రవారం రాత్రి అత్యంత చాకచక్యంగా బంధించారు. గత పదిహేను రోజులుగా ప్రత్తిపాడు, అనపర్తి, రామచంద్రాపురం పరిసరాలను వణికించిన ఈ పులి, చివరకు అధికారుల పకడ్బందీ ప్లాన్తో చిక్కింది. పాడుబడిన ఇంటి నుంచి గురక శబ్దాలు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు, అది గాఢ నిద్రలో ఉండగానే ఆపరేషన్ను వేగవంతం చేశారు.
నిజానికి పులిని బోనులోకి రప్పించేందుకు అధికారులు వేసిన ఎర ఫలించకపోవడంతో, ప్లాన్-బి ని అమలులోకి తెచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్లడం ప్రాణసంకటమని భావించిన అధికారులు, ఇంటి పైకప్పు నుంచి రంధ్రం చేసి పులి కదలికలను నిశితంగా గమనించారు. డ్రోన్ కెమెరాల సాయంతో పులి ఎక్కడ నక్కి ఉందో కచ్చితంగా గుర్తించారు. సమయం కోసం వేచి చూసిన షూటర్లు, ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మత్తు ఇంజక్షన్ను గురి తప్పకుండా షూట్ చేశారు. మత్తు ఇంజక్షన్ తగలగానే కాసేపు గర్జించిన ఆ బెంగాల్ టైగర్, కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. పులి పూర్తిగా స్పృహ కోల్పోయిందని నిర్ధారించుకున్న తర్వాత, అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు అత్యంత జాగ్రత్తగా లోపలికి ప్రవేశించి దానిని నెట్ సహాయంతో బంధించారు. అనంతరం సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తరలించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో కూర్మాపురం గ్రామస్తులతో పాటు జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.
గతంలో కాకినాడ జిల్లాలో పులిని పట్టుకునేందుకు నెలల తరబడి కష్టపడాల్సి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అధికారులు అత్యంత వేగంగా స్పందించారు. 144 సెక్షన్ విధించి, నైట్ విజన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అధికారులు తెలిపారు. పట్టుబడిన పులిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూ పార్కుకు లేదా సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించనున్నారు. దీంతో గత రెండు వారాలుగా సాగుతున్న పులి భయం నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లయింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos