తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల వంటి అత్యంత డిమాండ్ ఉన్న టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు మోసగాళ్లు అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మోసగాళ్లు తమను తాము టీటీడీ కార్యాలయాల్లో పనిచేసే అధికారులుగా, మంత్రులు లేదా ఇతర ప్రజాప్రతినిధుల పేషీ సిబ్బందిగా పరిచయం చేసుకుంటున్నారని చైర్మన్ వివరించారు. ఇలా భక్తులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తమ దృష్టికి అనేకం వచ్చాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎవరూ మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ఆయన గట్టిగా విజ్ఞప్తి చేశారు. దర్శన టికెట్లు, వసతి గదుల కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారానే బుక్ చేసుకోవాలని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఇప్పటికే భక్తులను మోసం చేస్తున్న దళారులను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ఎవరైనా మధ్యవర్తులు తమను సంప్రదిస్తే, భక్తులు వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలని కోరారు. అందరూ కలిసికట్టుగా తిరుమల పవిత్రతను కాపాడుకుందామని, క్షేత్రాన్ని దళారుల బారి నుంచి సురక్షితంగా ఉంచుదామని బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు.

Related Videos