జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. "జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు. "ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు కూడా శుభాభినందనలు" అంటూ చంద్రబాబు తన సందేశాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా 2014 మార్చి 14న హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా కాంగ్రెస్ హఠావో – దేశ్ బచావో అనే నినాదంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కేవలం అధికారం కోసం కాకుండా, సమాజంలో మార్పు కోసం, ప్రశ్నించే గొంతుకగా ఈ పార్టీ ఉద్భవించింది. ఆనాడు పార్టీకి ఎటువంటి కేడర్ లేకపోయినా, తనను నమ్మిన అభిమానులనే సైనికులుగా మార్చుకుని ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోటీకి దూరంగా ఉండి పొత్తులకు మద్దతునిచ్చిన పవన్ కళ్యాణ్, 2019లో ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గకుండా పదేళ్ల పాటు ఓర్పుతో, నిలకడతో పార్టీని నిర్మించిన తీరు నేటి రాజకీయాల్లో ఒక అద్భుతం.
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఈసారి ఆడంబరాలకు దూరంగా, గిరిజన ప్రాంతమైన పాడేరులోని నందిగరువు గ్రామంలో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడం ఆయన నవతరం రాజకీయానికి అద్దం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా బహిరంగ సభలను రద్దు చేసి, నేరుగా అడవి బిడ్డల చెంతకు వెళ్లి వారి సమస్యలను వినడం, వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం వంటి చర్యలు పార్టీ మూల సిద్ధాంతాలను ప్రతిబింబిస్తున్నాయి. అధికారం వచ్చినా గర్వపడకుండా, సామాన్యులకు , చేరువవ్వాలనే తపన జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos