విశాఖపట్నం: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం(IBM) విశాఖపట్నంలో తన నూతన ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ (FutureNow Centre)ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సేవలకు మద్దతుగా విశాఖ ఇసుకతోట జంక్షన్ లోని లాన్సమ్ స్వ్కేర్ భవనంలో ఐబీఎం సంస్థ ఏర్పాటుచేసిన ఫ్యూచర్నౌ సెంటర్ను ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ గవర్నెన్స్ ఇంటిలిజెన్స్, కెమికల్స్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ ఆపరేషన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా కన్సల్టింగ్ సేవలు, ఏఐ(AI) ఫస్ట్ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతుగా ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్నౌ సెంటర్ ను ఏర్పాటుచేయడం జరిగింది. భారతదేశ సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై సంస్థ కొనసాగిస్తున్న పెట్టుబడులకు ఇది మరో కీలక ముందడుగు కానుంది. ఈ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు కన్సల్టింగ్, సాంకేతిక సేవలను అందించనుంది. ఇందులో కృత్రిమ మేధస్సు (AI), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా & అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో సేవలు అందించనున్నారు. అదేవిధంగా ఏఐ ఆధారిత క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్, ప్లాట్ఫార్మ్ ఇంజనీరింగ్, సర్వీస్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ ఇంజనీరింగ్, యూజర్ ఎక్స్పీరియన్స్ సేవలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది.
ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ వర్క్ ఫోర్స్ అభివృద్ధే లక్ష్యం
భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతిక కేంద్రాల్లో ఆవిష్కరణలు, సేవల సామర్థ్యాలను విస్తరించాలన్న ఐబీఎం లక్ష్యానికి ఈ ఫ్యూచర్నౌ సెంటర్ ప్రతీకగా నిలుస్తోంది. విస్తృత సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థతో విశాఖపట్నం ప్రపంచ ఖాతాదారుల అవసరాలను తీర్చేందుకు అనువైన కేంద్రంగా ఎదుగుతోంది. ఈ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన సాంకేతిక నైపుణ్యాలున్న మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలి
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడాన్ని ఐబీఎం ఫ్యూచర్నౌ సెంటర్ తోడ్పాటునందిస్తోంది. మా లక్ష్యం, కేవలం సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే కాదు, నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం, ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా చేసే ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ పట్ల ఐబీఎం చూపుతున్న నిరంతర నిబద్ధతను మేం స్వాగతిస్తున్నాం. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం విశాఖపట్నాన్ని భారతదేశంలోని అగ్రగామి కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి ఐబీఎంతో కలిసి పనిచేయడానికిఎదురుచూస్తున్నామని అన్నారు.
ప్రపంచ ఆవిష్కరణల గమ్యస్థానంగా భారత్ను తీర్చిదిద్దుతాం
ఈ సందర్భంగా ఐబీఎం ఇండియా, సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ... వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భారతదేశానికి డిజిటల్ యుగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే అపూర్వ అవకాశం ఉంది. ప్రతిభ, ఆవిష్కరణలు, సాంకేతిక సామర్థ్యాలను సమన్వయం చేసుకుంటూ ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఐబీఎంలో మేం, మా ఖాతాదారులు ఏఐతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకుని, దీర్ఘకాలిక విలువను సృష్టించేందుకు అవసరమైన సామర్థ్యాలను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాం. విశాఖపట్నంలోని ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్నౌ సెంటర్ ఏర్పాటు ఇందుకు నిదర్శనం. అలాగే ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, సాంకేతిక సేవల కేంద్రంగా భారతదేశ స్థాయిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్నౌ సెంటర్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ ఉషా శ్రీకాంత్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రతిభ, బలమైన విద్యాసంస్థలు, టెక్నాలజీ ఎకోసిస్టమ్ వల్ల ప్రపంచ ఖాతాదారుల డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవసరాలకు మద్దతు ఇచ్చే కీలక కేంద్రంగా మారుతోంది. ఐబీఎం ఫ్యూచర్నౌ సెంటర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను స్థానిక ప్రతిభతో సమన్వయం చేస్తాం. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ను వేగవంతం చేయడంతో పాటు, స్థానిక యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఐబీఎం కన్సల్టింగ్ భారతదేశంలోని అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూరు, గురుగ్రామ్, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, లక్నో, ముంబై, మైసూరు, నోయిడా, పుణె, విశాఖపట్నం సహా 15 ప్రాంతాల నుంచి ఫ్యూచర్నౌ సెంటర్లను నిర్వహిస్తోంది.
ఐబీఎం ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ, వ్యాపార సేవల రంగాల్లో అగ్రగామి సంస్థ. 175కి పైగా దేశాల్లోని సంస్థలు తమ డేటా నుంచి విలువైన సమాచారాన్ని పొందడం, వ్యాపార ప్రక్రియలను సరళీకృతం చేయడం, వ్యయాలను తగ్గించడం, పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఐబీఎం సేవలను వినియోగిస్తున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్స్, హెల్త్ కేర్ వంటి కీలక మౌలిక సదుపాయాల విభాగాల్లోని వేలాది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్స్ ను వేగంగా, సమర్థంగా, భద్రంగా అమలు చేసేందుకు ఐబీఎం హైబ్రిడ్ క్లౌడ్ ప్లాట్ఫాం, రెడ్ హ్యాట్ ఓపెన్ షిప్ట్ ను వినియోగిస్తున్నాయి. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన క్లౌడ్ సొల్యూషన్స్, వ్యాపార సేవల రంగాల్లో ఐబీఎం అందిస్తున్న వినూత్న సాంకేతికత వినియోగదారులకు సౌలభ్యవంతమైన, అనువైన పరిష్కారాలను అందిస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos