అమరావతి: రాష్ట్రంలో కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కడప బేసిన్ పరిధిలోని వేంపల్లె పరిసరాల్లో లిథియం, గాలియం ఖనిజాల నిక్షేపాలపై విస్తృత స్థాయి అన్వేషణకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సీఎస్ఐఆర్–నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ), రాష్ట్ర గనులు–భూగర్భశాస్త్ర శాఖల మధ్య ఎంఓయూ కుదిరింది. బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్జీఆర్ఐ-రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నాయి. తుమ్మలపల్లె, పరిసర ప్రాంతాల్లో ఎన్జీఆర్ఐ నిర్వహించిన ప్రాథమిక పరిశోధనల్లో లిథియం, గాలియం ఖనిజాల ఆనవాళ్లు గుర్తించారు. లిథియం గరిష్ఠంగా 1,000 పీపీఎం, గాలియం 250 పీపీఎం వరకు ఉన్నట్లు అంచనా వేశారు. దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ నుంచి 100 శాతం నిధులతో... రూ.140 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మరోవైపు ఏపీలోని గనుల రంగంలో పరిశోధన, టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలకు సంబంధించి ఐఐటీ(ఐఎస్ఎం) ధన్బాద్–టెక్స్మిన్, గనుల శాఖ మధ్య సీఎం సమక్షంలో మరో ఎంఓయూ కుదిరింది. దీని ద్వారా రాష్ట్రంలో గనులకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఐఐటీ(ఐఎస్ఎం) ధన్బాద్ ఏర్పాటు చేయనుంది. ఈ ఎంఓయూ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఆయా సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos