టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ప్రతికూల నిర్ణయం వెలువడింది. రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించేందుకు వీలుగా సీఐడీకి అనుమతిస్తూ తీర్పు వెల్లడైంది. ఈ క్రమంలో... చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది.
ఇంకోవైపు, చంద్రబాబును ఎక్కడ విచారిస్తారు... జైల్లో విచారిస్తారా, తటస్థ ప్రదేశంలో విచారిస్తారా అని ఏసీబీ న్యాయమూర్తి ... సీఐడీని ప్రశ్నించారు. సీఐడీ అధికారుల సమాధానం ఆధారంగా ఆదేశాలు జారీ చేస్తామని జడ్జి చెప్పారు. దీంతో... రాజమండ్రి జైల్లోనే విచారిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సీఐడీ తరపు న్యాయవాదులు చెప్పారు. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు ఇంకా వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టును కోరినా... ఐదురోజులు కాకుండా కేవలం రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లకు కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటలలోపే ప్రశ్నించాలని... విచారణ సమయంలో తీసిన వీడియోలు బయటకు రాకుండా చూడాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ జరిపే అధికారుల పేర్లను కూడా ఇవ్వాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు.
కాగా... చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వడంతో ... స్కిల్ స్కామ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒకే రోజు రెండు కీలక తీర్పులు వెలువడటంతో టీడీపీ నేతలు నిరాశ చెందుతున్నారు. మున్ముందు అనుసరించాల్సిన న్యాయపోరాటం పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ అంశం పై ఎలాంటి అడుగులు వేస్తారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos