ఏపీలో గత నాలుగేళ్లలో మహిళల ట్రాఫికింగ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయని... జనసేన, ఇతర ప్రతిపక్షపార్టీలు పలు బహిరంగ సభల్లో గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం... దాని గురించి చర్యలు తీసుకుంటామని ఒక్కమాట చెప్పకపోగా ... ఎదురుదాడి చేస్తూ .. కాలం వెళ్లబుచ్చింది. ఈ క్రమంలో ఇప్పడు ఏపీపైనే మరో భారీ ఆరోపణ వచ్చిపడింది. ఈ సారి ఏ ప్రతిపక్షపార్టీలు ఈ విమర్శలు చేయలేదు. ఏకంగా... జాతీయస్థాయిలో సర్వే నిర్వహించిన ఒక ప్రముఖ స్వచ్ఛందసంస్థ ... ఈ వివరాలు వెల్లడించింది. ఈ సర్వే రిపోర్టును ప్రస్తావిస్తూ... ఇప్పుడేమంటూరు సీఎం గారూ... అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఆ వివరాలేమిటో పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా బాలల అక్రమ రవాణా ఆందోళనకరమైన పరిస్థితికి అద్దం పడుతోందని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. గేమ్స్ 247 అనే స్వచ్ఛంద సంస్థ, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన కేఎస్సీఎఫ్ సంస్థ సహకారంతో ఈ వివరాలు సేకరించి వెల్లడించింది. దేశంలో చిన్నపిల్లల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్న తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఉందని... బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో ఏపీ ఉన్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైందని తెలిపింది. 2016 నుంచి 2022 వరకు జరిగిన చిన్నారుల అక్రమ రవాణాపై ఈ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత్లో చిన్నారుల అక్రమ రవాణా’ పేరుతో గణాంకాలు వెల్లడించింది. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను బహిర్గతం చేసింది. దీని ప్రకారం చిన్నారుల అక్రమ రవాణాలో బిహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ మూడో స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ తర్వాత అక్రమ రవాణా 68 శాతం పెరిగింది. కేఎస్సీఎఫ్, దాని అనుబంధ సంస్థలతో సహకారంతో 2016 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల వివరాలను గేమ్స్ 247 సంస్థ సేకరించింది. బాలల అక్రమ రవాణాను అరికట్టటానికి పలు జిల్లాల్లో ఈ సంస్థకు చెందిన వారు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా... ఏపీకి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవలి గణాంకాలు బాలల అక్రమ రవాణా ఆందోళనకరమైన పరిస్థితిని చాటుతున్నాయి. ఈ దారుణ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం... 2021 లో ఏపీలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మొత్తం 58 మంది పిల్లలు అక్రమ రవాణాకు గురయ్యారు. వారిలో 11 మందిని యంత్రాంగం రక్షించింది. ప్రధానంగా లైంగిక దోపిడీ కోసం, వేశ్యా వృత్తి కోసం ఈ మానవ అక్రమ రవాణా జరిగినట్లు ఆ నివేదిక చెప్పింది. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకుని బాలల, మహిళల అక్రమ రవాణా జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos